ఏపీలో కొత్త రకం రాజకీయాలు నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై పదేపదే తప్పుడు ప్రచారం చేస్తూ, చాలా అవినీతి, అక్రమాలు జరిగిపోతున్నాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ రోజుకో రకం తప్పుడు ప్రచారం సాగుతోంది.
జగన్ అమరావతి రాజధాని కాకూడదనుకున్నారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మళ్ళీ అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారు.
కనుక అమరావతి వరద నీటిలో మునిగిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. దీని కోసం ఇతర రాష్ట్రాలలో, దేశాలలో జరిగిన ప్రకృతి విపత్తుల ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టేందుకు వైసీపీ వెనుకాడటం లేదు.
వైసీపీ దుష్ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం పదేపదే ఖండిస్తూనే ఉంది. కానీ ఈ దుష్ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఎందువల్లనంటే, ఎంత దుష్ప్రచారం చేస్తున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే! ఇదివరకు చర్యలు తీసుకున్నప్పుడు వైసీపీ దుష్ప్రచారం మానుకుంది. కానీ మళ్ళీ ఉదృతంగా మొదలుపెట్టింది.
ఈ విషయం సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇద్దరి దృష్టికి వచ్చింది. కనుక టీడీపి, జనసేన నేతలు కూడా ఈ దుష్ప్రచారాన్ని గట్టిగా ఖండించాలని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెపుతున్నారు.
ఇది చాలా అవసరమే కానీ వైసీపీ దుష్ప్రచారం కట్టడి చేయడానికి ఇదే పరిష్కారం అనుకుంటే ముక్కు ఎక్కడుంది?అంటే తలచుట్టూ తిప్పి చూపినట్లే ఉంటుంది.
ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నప్పుడు వారిపై తక్షణమే కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవడం చాలా అవసరం. మంచి కంటే చెడు త్వరగా వ్యాపిస్తుంది. కనుక ఈ దుష్ప్రచారమే ప్రజలకు త్వరగా చేరుతుంది.
అదే నిజమని అందరూ నమ్మితే నష్టపోయేది కూటమి ప్రభుత్వం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా. ఏవిదంగా అంటే, ‘అమరావతి మునిగిపోయింది…. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి..’ వంటి దుష్ప్రచారం వలన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలు నిలిచిపోతే రాష్ట్రం నష్టపోతుంది కదా?
కనుక వైసీపీ దుష్ప్రచారాన్ని కట్టడి చేయడం అవసరం మాత్రమే కాదు ప్రభుత్వ బాధ్యత కూడా.
ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలున్నట్లుగా ఈ దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడానికి కూడా ప్రత్యేకంగా ఓ శాఖ ఏర్పాటుచేసుకొని దానికో మంత్రి, అధికారులు, ఉద్యోగులను నియమించుకోవాల్సిన రోజు ఎంతో దూరం లేదు.




