వైసీపి ప్రభుత్వం నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఎందుకు హడావుడి చేసిందనే దానిపై ఇప్పటికే రెండు రాష్ట్రాలలో వివిద పార్టీల నేతలు వివరించి చెప్పారు. కనుక ఇప్పుడు ఆ చర్చ అవసరం లేదు.
కానీ వైసీపి ప్రభుత్వం ఏ ఉద్దేశ్యం లేదా కారణంతో ఈ దుందుడుకు పని చేసినప్పటికీ దాంతో ఆంధ్రప్రదేశ్ పరువు కృష్ణానదిలోనే కలిపేసిందని చెప్పక తప్పదు.
కేసీఆర్కు అత్యంత ఆప్తుడు, తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన ఈ విమర్శలు వింటే అర్దమవుతుంది. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “డ్యామ్ మీదకి ఏపీ ప్రభుత్వం పోలీసులను పంపించి యుద్ధవాతావరణం సృష్టించడం సరికాదు. ఏపీ ప్రభుత్వం దురాలోచనతోనే ఈ దుశ్చర్యకు పాల్పడిందని మేము భావిస్తున్నాము. ఏపీ ప్రభుత్వం ఈవిదంగా దుందుడుకుతనంతో వ్యవహరిస్తే రెండు రాష్ట్రాల మద్య సంబంధాలు దెబ్బ తింటాయి,” అని గుత్తా సుఖేందర్ రెడ్డి సున్నితంగా హెచ్చరించారు.
తెలంగాణ ఎన్నికలలో బీజేపీ-బిఆర్ఎస్ పార్టీల మద్య ఎటువంటి రహస్య అవగాహన లేదని వాదించి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించిన్నట్లే, ఇప్పుడు ఈ డ్యామ్ డ్రామాను కూడా కేసీఆర్, జగన్ కలిసి ఆడలేదని నిరూపించుకొనేందుకు, గుత్తా సుఖేందర్ రెడ్డి ఈవిదంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసి ఉండవచ్చు.
ఇటువంటి విమర్శల వలన వైసీపి ప్రభుత్వానికి కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ అది దుందుడుకుతనంతో దుశ్చర్యకు పాల్పడటం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్రదిష్ట కలుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఎన్నికలతో బిజీగా ఉన్నప్పుడు, ఏపీ ప్రభుత్వం దౌర్జన్యం చేసి నీళ్ళు తరలించుకుపోయిందనే అపవాదు మిగిలిపోయింది. ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రంగా నవ్వులపాలవుతున్న ఆంధ్రప్రదేశ్కి కొత్తగా ఈ అపకీర్తి కూడా అవసరమా?




