ఇటీవల పదో తరగతి పరీక్షలలో అత్యుత్తమ మార్కులు, ర్యాంకులు సాధించిన విద్యార్థులను వైసీపీ ప్రభుత్వం ‘జగనన్న ఆణిముత్యాలు’ గా బ్రాండింగ్ చేసి, సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా వారికి నగదు పురస్కారాలు అందించారు. చాలా సంతోషం. అయితే ఏపీలో ఆణిముత్యాల కంటే జాతిరత్నాలే ఎక్కువగా ఉన్నారు. వైసీపీలోనే అనేక జాతిరత్నాలున్నాయి.
వివేకానందరెడ్డిని హత్యచేసిన జాతిరత్నాలన్నీ వైసీపీలోనే ఉన్నాయని సీబీఐ చెపుతూనే ఉంది. కాకినాడలో సుబ్రహ్మణ్యం అనే దళితయువకుడుని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఓ జాతిరత్నమే. కోర్టులో కేసు తాలూకు కాగితాలు ఎత్తుకుపోయిన జాతిరత్నం ఎవరో అందరికీ తెలుసు.
నోరు విప్పితే బూతులు ప్రవాహంలా పారించే జాతిరత్నాలు వైసీపీలో లెక్కలేనన్ని. సంక్రాంతి వస్తే లాటరీలు, క్యాసినోలు నిర్వహించి రోడ్లపై డ్యాన్సులు చేస్తూ ప్రజలను అలరించే జాతిరత్నాల గురించి అందరికీ తెలుసు.
ప్రతిపక్షనేతలు జిల్లా పర్యటనలలో వారిపై రాళ్ళు, కోడిగుడ్లు, చెప్పులు వేయించే ‘ట్రెయినీ జాతిరత్నాలు’ లెక్కపెట్టడం ఎవరి వలనా సాధ్యం కాదు. బాపట్లలో పదో తరగతి విద్యార్ధిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన జాతిరత్నాలు వైసీపీలోనే ఉన్నాయి.
అసలు ఈ నాలుగేళ్ళలో ఏపీలో బయటపడ్డ జాతిరత్నాలను లెక్కపెట్టడం ఎవరి వల్లా కాదు. అయితే ‘జగనన్న ఆణిముత్యాలను’ బ్రాండింగ్ చేసుకొన్నప్పుడు, పార్టీలోనే ఇటువంటి జాతిరత్నాలను ‘జగనన్న జాతిరత్నాలు’ అని బ్రాండింగ్ చేసుకోకపోవడం చాలా విచారకరమే కదా?



