చిరంజీవిపై పద్దతిగా బురద జల్లితే వైసీపికి నష్టం ఉండదా?

Chiranjeevi_TV9

మెగాస్టార్ చిరంజీవి గతంలో రాజకీయాలలో చెయ్యి కాల్చుకోవడంతో వాటికి దూరంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ జనసేనతో ఏపీ రాజకీయాలలో దూసుకుపోతుండటంతో ఓ అన్నగా ఆశీర్వదించారు. వారి కూటమి విజయం సాధించాలని కోరుకొన్నారు.

ఎన్నికలలో మెగాస్టార్ తప్పకుండా పవన్‌ కళ్యాణ్‌కు మద్దతు ఇస్తారని వైసీపి ముందే ఊహించింది. కనుక అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకొని సిద్దంగా ఉంది.

ADVERTISEMENT

చిరంజీవి ఈ మూడు ముక్కలు అనగానే ఆయనపై సజ్జల రామకృష్ణా రెడ్డి విరుచుకు పడ్డారు. కానీ మెగాస్టార్ చిరంజీవి గురించి కీలకమైన ఈ సమయంలో నోటికి వచ్చిన్నట్లు మాట్లాడితే వైసీపికే తీవ్ర నష్టం జరుగుతుందని తెలుసు. కనుక పార్టీ నేతలను ముందే కట్టడి చేసి పార్టీ తరపున వారి సొంత మీడియా చిరంజీవిపై ‘పద్దతిగా బురద జల్లడం’ ప్రారంభించింది.

బహుశః పవన్‌ కళ్యాణ్‌ ఒత్తిడి చేయడం వలననే చిరంజీవి రూ.5 కోట్లు జనసేనకు ఇచ్చి ఉండవచ్చని సాక్షి అనుమానం వ్యక్తం చేసింది. జగన్మోహన్‌ రెడ్డి తన వద్దకు వచ్చిన చిరంజీవి బృందాన్ని చాలా గౌరవించారని, కానీ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లే వారి గురించి చాలా తప్పుగా మాట్లాడారని సాక్షి కొత్త విషయం కనుగొని చెప్పింది.

చిరంజీవి ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకొని ఇప్పుడు అవినీతిపరులను సమర్ధిస్తూ తన ప్రతిష్టను తానే దిగజార్చుకొంటున్నారని కనిపెట్టి చెప్పింది. చిరంజీవి డిఫరెంట్ అనుకుంటే ఆయన కూడా పవన్‌ కళ్యాణ్‌లాంటివారేనని నిరూపించుకుంటున్నారని తేల్చి చెప్పేసింది.

ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదు ఇచ్చినందుకే బీజేపీతో ఉన్న కూటమికి మద్దతు ప్రకటించారని అనుకోవలసి వస్తుందని సాక్షి పేర్కొంది. అవినీతిపరుడైన సిఎం రమేష్‌ని పక్కన కూర్చొబెట్టుకొని ఫోటో దిగడం ఇంకా తప్పని నిర్దార్ధించేసింది.

ఏది ఏమైనప్పటికీ చిరంజీవి చేసింది చాలా తప్పు… అనైతికం అని అందరూ (వైసీపిలో అందరూ?) ఒప్పుకుంటారని తీర్మానించేసింది.

ఒకవేళ చిరంజీవి వైసీపికి, జగన్మోహన్‌ రెడ్డికి మద్దతు ప్రకటించి ఉండి ఉంటే ఆయన వైసీపికి, సాక్షి మీడియాకు ఉత్తమోత్తముడుగా కనిపించేవారు. అలాగే అభివర్ణించి ఉండేవారు. కానీ టిడిపి, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు అని చెప్పిన పాపానికి ఆయనపై కూడా ఈవిదంగా బురద జల్లడానికి వెనకాడటం లేదు. అంటే రాష్ట్రంలో ఎవరికీ రాజకీయ స్వేచ్చ లేదనుకోవాలేమో?

చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డుకి మించిన అవార్డులకు అర్హుడని అందరికీ తెలుసు. ఆయనను జగన్‌ చాలా గౌరవించారని చెపుతూనే పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చిన్నందుకే ఆయన బీజేపీకి మద్దతు పలుకుతున్నారని, పవన్‌ కళ్యాణ్‌ ఒత్తిడి వల్లే జనసేనకు 5 కోట్లు ఇచ్చారంటూ చాలా నీచంగా వ్రాయడం దారుణమే కదా?ఇదేనా జగన్‌ ప్రభుత్వం చిరంజీవికి ఇస్తున్న గౌరవం?

ADVERTISEMENT
Latest Stories