“ప్రభుత్వ సొమ్ము వైసీపీ పార్టీ పాలు”!వైసీపీ ప్రచారానికి ఇది పరాకాష్ట.!

YSRCP

టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో సైబరాబాద్ వంటి మహా నగరాన్ని నిర్మించి హైద్రాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టాను అంటూ తన ప్రసంగాలలో చెప్పుకుంటారు. అయితే ఒక నగరాన్ని నిర్మించడాన్ని వైసీపీ నాయకులు ఎంత చిన్న చూపు చూస్తారో వారి విమర్శలతోనే అర్ధమవుతుంది. “చేసింది రవ్వంత చెప్పేది కొండంతా” అంటూ బాబు హైద్రాబాద్ కు చేసిన అభివృద్ధిని రవ్వంతతో పోలుస్తారు.

చంద్రబాబు ప్రచార ఆర్భాటాల మీద ఖర్చుతో మరో నగరాన్ని నిర్మించవచ్చు అంటూ పదేపదే విమర్శలు చేసిన వైసీపీ నాయకులు, వారు వారి పార్టీ ప్రచారానికి, జగన్ స్టిక్కర్లకు పెట్టిన ఖర్చుతో ఒకటి కాదు వారు చెప్పినట్టే రాష్ట్రానికి మూడు రాజధానులు కూడా నిర్మించవచ్చని తాజాగా మరోసారి నిరూపించారు.

ADVERTISEMENT

“ఆడుదాం ఆంధ్రా”..,పేరుతో రాష్ట్రంలో క్రీడా పోటీలు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి ఇన్నాళ్లకు వైసీపీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది అని ఆనందపడే లోపే వైసీపీ గుట్టు బయటపడింది.రాష్ట్రంలో నిర్వహించే ఏ కార్యక్రమమైనా తన రాజకీయ అవసరానికి ఉపయోగపడేలా రూపొందిస్తారు అనేది జగన్ మరోసారి నిరూపించుకున్నారు.

క్రీడా పోటీలకు అవసరమైన క్రీడా సామాగ్రి మీద, ఆటలో గెలిచిన వారికీ ఇచ్చే పథకాల మీద కూడా జగన్ చిత్రాలను ముద్రించడం వైసీపీ ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరింది అని రుజువుచేశారు. ఆటగాళ్లు ధరించే టి.షర్ట్స్ మీద, క్రికెట్ కిట్లలో వాడే వికెట్ల మీద, ప్లేయర్లకు ఇచ్చే మెడల్స్ మీద రాజముద్రలు ముద్రించిన మాదిరి జగన్ చిత్రాలు ముద్రించారు. ప్రజల డబ్బుతో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసుకోవడంతో మొదలుపెట్టిన వైసీపీ ప్రచారాలు చివరికి ప్రభుత్వం పంపిణి చేసే పిల్లలు తాగే పాలప్యాకెట్ ల మీద వరకు చేరాయి.

ప్రజల టాక్సులతో వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ పథకాల రూపంలో ప్రజలకు అందించడానికి జగన్ బొమ్మలే,తమ కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తి పేపర్ల మీద జగన్ చిత్రాలే,ప్రభుత్వం పిల్లలకు పంపిణి చేసే పుస్తకాలు, స్కూల్ బాగ్ లు, బెల్టుల మీద, చివరికి పిల్లలకు ఇచ్చే చిక్కి మీద కూడా ఆయనగారి దర్శనమే. ఇక ఇప్పుడు ఆటగాడళ్లకు ఇచ్చే పథకాల మీద కూడా జగనే ప్రత్యేక్షమవటం చూస్తుంటే ఇక ఏపీకి కొత్తగా జగన్ చిత్రాలతో నాణాలు ముద్రించి వాటినే చలామణిలోకి తీసుకువస్తారేమో అనిపిస్తుంది.

జగన్ చేస్తున్న ఇదంతా ప్రచారం కాదేమో అంతకు మించి అన్నట్టుగా ఉంది అంటున్నారు సామాన్య ప్రజలు. “అత్త సొమ్ము అల్లుడు దానం”…అన్న చందంగా “ప్రభుత్వ సొమ్ము వైసీపీ పార్టీ పాలు” అన్నట్టుగా తయారయ్యింది.

ADVERTISEMENT
Latest Stories