గమనిక: సాధికార సభలకు జనం కావలెను!

YSRCP Samajika Sadhikara Sabha Machilipatnam

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఆదేశం మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాధికార సభలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ జిల్లా లేదా నియోజకవర్గంలో పర్యటనకు వస్తున్నారని తెలిస్తే తండోపతండాలుగా ప్రజలు వస్తుంటారు. కానీ వైసీపి చేపట్టిన ‘సాసా సభ’లకు జనసమీకరణ చేయాల్సి వస్తోంది.

ADVERTISEMENT

డబ్బులిచ్చి, బస్సులు, ఆటోలలో జనాలను తెచ్చుకొన్న వారు ఏమాత్రం కృతజ్ఞత చూపకుండా వైసీపి నేతలు జగన్‌ భజన మొదలుపెట్టగానే లేచి వెళ్ళిపోతున్నారు. అప్పటికీ… వైసీపి కార్యకర్తల వంటి వాలంటీర్లతో వారిని కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. చుట్టూ బారికేడ్లు పెట్టి పారిపోకుండా ఆపాలని ప్రయత్నిస్తున్నారు. కానీ జనాలను ఆపలేకపోతున్నారు. దీంతో సాసా సభలలో జనాల కంటే ఖాళీ కుర్చీలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

మచిలీపట్నంలో పేర్ని నాని అధ్వర్యంలో బుధవారం జరిగిన సాసా సభ కోసం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వేదిక ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల 5-6 గ్రామాల నుంచి ఆటోలలో జనాలను తీసుకువచ్చారు. సభకు ఇబ్బంది కలగకూడదని కిలోమీటర్ దూరం నుంచే భారీగా పోలీసులను మోహరించి, వాహనాలను మళ్ళించారు.

సాసా సభకు మంత్రి ధర్మాన ప్రసాద రావు, వైసీపి ఎమ్మెల్యేలు అనిల్ కుమార్‌ యాదవ్, పేర్ని నాని కుమారుడు కిట్టు తదితరులు హాజరయ్యారు. టంచనుగా సాయంత్రం 5 గంటలకే వైసీపి నేతలందరూ వేదికపైకి వచ్చేశారు.

వేసవి ఎండల్లా సంక్షేమ పధకాలతో ఏపీలో ప్రజల జీవన ప్రమాణాలు ఏవిదంగా శరవేగంగా పెరిగిపోతున్నాయో మంత్రి ధర్మాన చెప్పడం మొదలుపెట్టేసరికి, జనాలు కుర్చీలలో నుంచి లేవడం మొదలుపెట్టారు! వారి ప్రసంగాలు పూర్తయ్యేసరికి మొదటి నాలుగైదు వరుసల్లో కాస్త జనాలు, వైసీపి నేతల అనుచరులు, పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు మాత్రమే మిగిలారు.

కనుక సాసా సభలకు నిలకడగా కూర్చొని వైసీపి నేతల ప్రసంగాలు శ్రద్దగా విని చప్పట్లు కొట్టే జనాలు కావలెను. ఆసక్తి గలవారు తమ ప్రాంతంలోని వాలంటీర్లను సంప్రదించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories