ఒక రాజకీయ పార్టీని స్థాపించడం, దానిని నిర్వహించడం, దాంతో ప్రజలకు చేరువవడం, ఎన్నికలలో గెలవడం చాలాచాలా కష్టమైనవి. ఎంతగానో శ్రమించి ఆ కష్టాలన్నీ అధిగమించి అధికారంలోకి వచ్చాక దానిని నిలుపుకోవడం కూడా కష్టమే. రాష్ట్రంలో రాజకీయ పార్టీలను చూస్తే ఈ విషయం అర్దమవుతుంది.
ప్రస్తుతం జనసేన కూడా రాజకీయంగా నిలదొక్కుకొని, ఎన్నికలలో గెలిచేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలు పంచుకొన్నారు.
వైసీపీని తాను మొదటి నుంచి వ్యతిరేకిస్తుండటం వలన, తనను రాజకీయాలలో రావద్దని, వస్తే లేపేస్తామని వైసీపీ బెదిరించిందని చెప్పారు. గత ఏడాది తాను విశాఖలో పర్యటించినప్పుడు కూడా గొడవలు సృష్టించి, తనను లేపేసేందుకు అప్పుడే వైసీపీ ప్రయత్నించిందన్నారు. ఆనాడు వివేకాను హత్య చేయించినవారే ఇప్పుడు తనను హత్య చేసేందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నారని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను రౌడీలా మాట్లాడుతున్నానంటూ కొందరు చేసిన విమర్శలపై స్పందిస్తూ, “ఎవరైనా కత్తులతో మనపై దాడి చేయడానికి వస్తుంటే మనం శాంతి ప్రవచనాలు వల్లించము కదా?అందుకే వారికి అర్దమయ్యే భాషలో నేను మాట్లాడవలసివస్తోందని” అన్నారు. “వైసీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలకు భయపడి పారిశ్రామికవేత్తలు, ప్రతిపక్షాలు, పారిపోగలరేమో కానీ సామాన్య ప్రజలు ఎక్కడకి పారిగిపోగలరు? అప్పుడు వారికి అండగా ఎవరు నిలబడతారు?” అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
తనకు ప్రాణహాని ఉన్నప్పటికీ అందరి తరపునా వైసీపీ నేతలతో పోరాడేందుకు తాను సిద్దంగా ఉన్నానని అన్నారు. తాను ఈవిదంగా నిలబడుతున్నందునే రాష్ట్రంలో వివిద వర్గాలు ధైర్యంగా ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ నాలుగేళ్లలో వైసీపీ అరాచకాలను చూస్తూ, భరిస్తున్న ప్రజలలో కొంత మార్పు వచ్చిందని, కనుక ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి పోరాడాలని విజ్ఞప్తి చేశారు.
మనవాడని ఓట్లేసి గెలిపించుకొని నెత్తిన పెట్టుకొంటే ఆ మనోడే అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. పాము తన గుడ్లను తానే తినేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వంలో సొంత ఎంపీలు, ఎమ్మెల్యేలనే వేధిస్తోందని ఇక ప్రతిపక్ష నేతలకు, సామాన్యుల పరిస్థితి ఏవిదంగా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు.
ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు, రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు రూ.1,000-1,500 కోట్లు నష్టపోతుంటే, వైసీపీ ప్రభుత్వం నా సినిమాలను దెబ్బ తీస్తుండటం వలన నేను రూ. 20-30 కోట్లు నష్టపోతున్నాను. అదే ఓ తోపుడు బండివాడైతే రోజుకి రూ.500 నష్టపోతుంటాడు. అంటే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత నష్టపోతూనే ఉన్నారని అర్దమవుతోందని పవన్ కళ్యాణ్ అన్నారు.
అయితే ప్రభుత్వం వలన సమస్యలు వస్తే కాసేపు తిట్టుకోవడం, విధిలేని పరిస్థితులలో ఆ సమస్యలను భరించి బ్రతికేస్తుండటం అలవాటైపోయిందన్నారు. ఈ డిజిటల్ యుగంలో ప్రజలలో భావోద్వేగాలు ఎక్కువ సమయం నిలిచి ఉండటంలేదని అన్నారు.
ఏపీలో ఈ దారుణమైన పరిస్థితులు చూస్తున్నప్పుడు నాకు పూర్తిస్థాయిలో రాజకీయాలలోకి రావలనే ఉందని కానీ పార్టీ నిర్వహణ కోసం తప్పనిసరిగా సినిమాలు చేయవలసివస్తోందన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం తన ఆర్ధిక మూలాలు కూడా దెబ్బ తీసేందుకు తన సినిమాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు.
ఇటువంటి సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొనేందుకు సిద్దపడే రాజకీయాలలోకి వచ్చానన్నారు. తన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని తెలిసీ కూడా ప్రజల తరపున వైసీపీ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నానని, కనుక ప్రజలందరూ తనకు బాసటగా నిలవాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.



