మహిళల చుట్టూ మొదలైన వైసీపీ రాజకీయం, మహిళలతో జగన్ సాగించిన వ్యూహాలు, మహిళ చేతిలోనే ఓడిపోయాయి అనేలా వైసీపీ రాజకీయం, జగన్ వ్యూహాలు నేడు ఒక టీడీపీ మహిళా నేత పోటీతో చిన్నబోయాయి, అలాగే ఆ మహిళా నేత గెలుపుతో చతికిలపడ్డాయి.
వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు ప్రత్యర్థి పార్టీల మహిళా నేతల మీద, ఆయా నాయకుల కుటుంబంలోని ఆడవారి పైన, పార్టీ అధినేతల భార్యల పైన నీచ రాజకీయం నడిపింది. అటు సోషల్ మీడియా వేదికల నుంచి ఇటు అసెంబ్లీ వరకు వైసీపీ రాజకీయం మహిళల కేంద్రంగానే నడిచింది, మహిళల మీదే తిరిగింది.
జగన్ రాజకీయ వ్యూహాలు కేవలం బయటివారికి మాత్రమే పరిమితం కాలేదు అనేట్టుగా వైసీపీ లో గూడుకట్టుకున్న ఈ నీచ సంస్కృతీ జగన్ తల్లిని, చెల్లిని కూడా వెంటాడి వేధించాయి. వైస్ వివేకా కుటుంబాన్ని సైతం రోడ్డుకు లాగాయి.
ఇలా వైసీపీ రాజకీయం మొత్తం మహిళల చుట్టే తిరిగింది, ఇక 2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ వేసిన రాజకీయ వ్యూహాలు, పార్టీ గెలుపు కోసం జగన్ చేసిన ప్రణాళికలు మహిళలతో ముడిపడి ఉన్నాయి.
ఉదాహరణకు నారా లోకేష్ పోటీలో దిగిన మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డిని కాదని, ఆ తరువాత ప్రకటించిన గంజి చిరంజీవిని తప్పించి చివరికి లావణ్య అనే ఒక మహిళా నేతను లోకేష్ కు ప్రత్యర్థిగా రంగంలోకి దింపారు జగన్.
అదే స్ట్రాటజీ తో జనసేన అధినేత పోటీ చేస్తున్న పిఠాపురంలో కూడా పవన్ కు ప్రత్యామ్నాయంగా వైసీపీ నుంచి వంగా గీతను బరిలోకి దింపారు. ఇలా కూటమికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ రెండు నియోజకవర్గాలలోని జగన్ తమ ప్రత్యర్థి బలాన్ని తక్కువ అంచనా వేసారో,
లేక తన పార్టీ బలహీనతను ఒప్పుకుంటూ ఇలా మహిళా నేతలను బరిలోకి దింపి తమ ఓటమి భారాన్ని పక్కకి నెట్టాలనుకున్నారో కానీ ఈ రెండు నియోజకవర్గాలలో వైసీపీ మహిళలతో తన రాజకీయ చదరంగాన్ని ముందుకు తీసుకెళ్లింది.
ఇక్కడ వైసీపీ ప్రత్యర్థులు గెలిస్తే వారి గెలుపును తక్కువ చేసి చూపేలా మహిళలను ముందుంచిన వైసీపీ, ఒకవేళ వైసీపీ విజయం సాధిస్తే కూటమి కీలక నాయకులు ఇద్దరు మహిళల చేతిలో ఓడిపోయారు అంటూ హేళన చేస్తూ టీడీపీ, జనసేనలను వెనక్కి నెట్టాలని వైసీపీ పక్కా ప్రణాళికలు వేసి 2024 ఎన్నికల పోరుకి సిద్దమయ్యింది.
నాడు మహిళల చుట్టూ వైసీపీ చేసిన ఈ నీచ రాజకీయానికి, మహిళల తో జగన్ వేసిన వ్యూహాలకు నేడు పులివెందుల, జగన్ సొంత ఇలాకాలో వైసీపీ ఒక మహిళా నేత చేతిలో వైసీపీ చిత్తు చిత్తుగా ఓటమి పాలయ్యింది.
బీటెక్ రవి సతీమణి లతా రెడ్డి తో తలపడిన వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి కేవలం 683 ఓట్లు సాధించి కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. వైసీపీ కి ఈ స్థాయి ఓటమి అందునా పులివెందుల వంటి వైఎస్ కుటుంబ కంచుకోటలో, వైసీపీ అడ్డాలో టీడీపీ మహిళా నేత విజయం అంటే అది సామాన్యమైన విషయం కాదనే చెప్పాలి.
ఈ పరిణామాలన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే వైసీపీ కి మహిళా రాజకీయం అచ్చి రాలేదేమో అనిపిస్తుంది. నాడు వైసీపీ భువనేశ్వరి నుంచి అన్నా వరకు మహిళల మీద చేసిన రాజకీయం వైసీపీ ని పాతాళానికి తొక్కితే, ఇక మంగళగిరి, పిఠాపురం అంటూ లోకేష్, పవన్ ల చుట్టూ నడిపిన వైసీపీ మహిళా రాజకీయం బెడిసికొట్టింది.
ఇక నేడు పులివెందులలో వైసీపీ ఓటమి ఒక మహిళా నేత చేతిలోనే కావడంతో వైసీపీ కి మహిళల శాపం ఏమైనా ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇటు వైసీపీ ఓటమి కోసం సొంత కుటుంబ సభ్యులే పోరాటం చేయడంతో ఈ ప్రశ్న కు మరింత బలం చేకూరుతుంది.
దానికి తోడు నాడు మహిళా ఓటింగే ప్రధాన టార్గెట్ గా వైసీపీ నవరత్నాలు అంటూ జగన్ బటన్లు నొక్కినా చివరికి రాష్ట్రంలోని అధిక భాగం మహిళా శక్తి పసుపు – ఎరుపు – పుష్పం అంటూ తమ ఓటింగ్ బటన్లతో కూటమికే పట్టం కట్టారు, వైసీపీ పీక నొక్కారు.




