బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ ఫోటో అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రస్తుత సమాజంలో కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయన్న విషయానికి ఇది అద్దం పడుతోంది. పెరుగుతున్న సాంకేతికత మనుషులను మౌనమునులుగా మారుస్తోందనడానికి ఈ ఫోటోను ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చేమో!
అమితాబ్ షేర్ చేసిన ఈ ఫోటోలో ఆయన కుటుంబం అంటే… చిన్నారులు శ్వేతా బచ్చన్ నందా, అభిషేక్ బచ్చన్, మనవళ్లు నవ్యా నావెలి నందా, అగస్త్య తదితరులందరూ ఒకే హాల్ లో కూర్చుని ఉన్నారు. అందరూ హాల్ లో ఒకరికి ఒకరు అందేంత దూరంలో కూర్చున్నా, రూములో అంతమంది ఉన్నా ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.
కారణం… ప్రతీ ఒక్కరి చేతుల్లోనూ మొబైల్ ఉంది. అందరూ అందులోనే మునిగిపోయారు. తదేక దీక్షతో మొబైల్ను ఆపరేట్ చేస్తూ ప్రపంచాన్ని మైమరచిపోయారు. “అందరూ ఒక చోటే ఉన్నారు. వారితో ఫోన్లు కూడా ఉన్నాయి” అంటూ అమితాబ్ తన ఫోటోకు క్యాప్షన్ రాశారు. అందరిలో ఒక్క నవ్య ఒక్కర్తే పుస్తకం చదువుతూ కూర్చోవడం విశేషం.




