2024 ఎన్నికలు…రాష్ట్రానికే కాదు అన్ని పార్టీలకు కీలకమే..!

YCP TDP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికలు రాష్ట్రానికి ఎంత కీలకమో, అలాగే పోటీలో తలబడుతున్న అన్ని రాజకీయ పార్టీలకు అంతే కీలకంగా మారనున్నాయి. తెస్తానన్న ప్రత్యేక హోదా తేలేదు…ఇస్తానన్న ప్రత్యేక ప్యాకేజీ అందుకోలేకపోయారు…ఉన్న ఒక్క రాజధాని పూర్తి కాలేదు..తెచ్చిన మూడు రాజధానుల ఊసేలేదు.

అప్పులు తప్ప ఆదాయం చూడని రాష్ట్రంగా, ఈ ఐదేళ్లలో సంక్షేమమే తప్ప అభివృద్ధి నోచుకోని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు ఈసారి జరగబోయే ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారిపోయింది. అలాగే రాష్ట్రంతో పాటుగా రాజకీయాలు నడిపిస్తున్న ఆయా పార్టీలకు కూడా 2024 ఎన్నికలు ఎంతో కీలకం కానున్నాయి. ముందుగా అధికార పార్టీ వైసీపీ గురించి…,

ADVERTISEMENT

* యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)…

వైస్సార్ మరణం తరువాత జన్మించిన వైసీపీ పార్టీ వివేకా హత్య తరువాత అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే అక్రమ సంపాదన, మనీ లాండరింగ్ కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటు దాదాపు 16 నెలలు జైలు జీవితం అనుభవించి బెయిలు మీద బయటకు వచ్చి ఒక దశాబ్దం పాటు చేసిన రాజకీయాలతో 2019 ఎన్నికలలో అనుకున్న ముఖ్యమంత్రి పదవిని అందుకోగలిగారు వైస్ జగన్మోహన్ రెడ్డి.

అయితే బెయిలు మీద ఉంటూ పాలన కొనసాగిస్తున్న జగన్ కు ఒక్క సారి అధికారం చేజారినా, ఉన్న ముఖ్యమంత్రి పదవిని కోల్పోయినా దశాబ్ద కాలం పాటు అధికారం అనే నాగబంధనం వేసి ఆపిన కేసులన్నీ ఒక్కసారిగా జగన్ మెడకు చుట్టుకుంటాయి. దానికి తోడు ఈ ఐదేళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ చేసిన అవినీతి అంటూ వచ్చిన కొత్త ప్రభుత్వం జగన్ ఖాతాలో మరిన్ని కొత్త కేసులను జోడించే అవకాశం ఉంటుంది.

ఇన్నాళ్ల తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముందుకు సాగనీయకుండా చేసిన వివేకా హత్య కేసు, కోడికత్తి కేసు మళ్ళీ తెరమీదకు వచ్చే పరిస్థితి ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయానికి విలువలు దిగజారుస్తూ బూతులతో వ్యక్తిగత దూషణలకు పురికొల్పడం, దాడులను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను రాష్ట్రానికి పరిచయం చేసింది. వీటన్నిటి వెనుక వైకాపా నాయకుల బలం, బలగం మొత్తం అధికారం అనే బహ్మాస్త్రమే.

ఇప్పుడు వైసీపీ కి ఆ బ్రహ్మాస్త్రమే దూరమైతే, ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఒక్కసారి అధికారం చేజారితే ఆ పార్టీ పరిస్థితి, ఆ పార్టీ అధినేత దుస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కళ్లముందే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బిఆర్ఎస్ లు సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో జగన్ కు ఇదే పరిస్థితి రాకతప్పదు. ఇక ప్రతిపక్షమైన టీడీపీ వంతు…,

* తెలుగుదేశం పార్టీ (టీడీపీ)…

తెలుగు వాడి ఆత్మగౌరవం అనే నినాదంతో నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగు దేశం. ఆరు దశబ్దాల కాంగ్రెస్ అధికారాన్ని సైకిల్ గుర్తుతో కాలరాసి తెలుగు రాష్ట్రాలలో పార్టీ స్థాపించిన 9 నెలలలోపు అధికారాన్ని అందిపుచ్చుకున్న ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించిన టీడీపీ పార్టీ కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ చంద్రబాబు నాయకత్వంలో మరింత బలంగా ప్రజలలోకి వెళ్లగలిగింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తనదైన మార్క్ చూపించిన టీడీపీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే హావ కొనసాగించింది.

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైనప్పటికీ ఏపీలో అధికారాన్ని అందిపుచ్చుకోగలిగింది. అయితే సన్ రైజ్ సిటీ, అమరావతి అంటూ హడావుడి చేసిన ప్రజలు జగన్ ఒక్క ఛాన్స్ వైపే నిలబడడంతో అధికారానికి దూరమయ్యి ప్రతిపక్షానికి పరితమయ్యారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా,10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు …వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కున్న అవమానాలు, ఛీత్కారాలు ఎన్నడూ ఎదుర్కోలేదు.

40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో జైలు గేటు తాకని బాబు జగన్ ప్రభుత్వంలో దాదాపు 51 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడపవలసి వచ్చింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో బాబు అవినీతి చేసారంటూ ఆరోపిస్తూ వైసీపీ బాబుని జైలుకు పంపగలిగింది. ఇవి బాబు రాజకీయ జీవితంలో చీకటి రోజులుగా మిగిలిపోతాయంటూ టీడీపీ క్యాడర్ భావోద్వేగానికి గురయ్యింది. ఇప్పటికే తనకున్న అధికారాన్ని అవకాశంగా మార్చుకుని ఇటు బాబు పైన అటు లోకేష్ పైన ఎన్నో కేసులతో కాసుకొని కూర్చుంది వైసీపీ.

ఈ సారి జరగబోతున్న ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రాకపోతే వైసీపీ ని కట్టడి చేయడం ఎవరికి సాధ్యం కాదనేది చంద్రబాబు కు కూడా తెలిసిన అంశమే. అలాగే ఇప్పటికే తెలంగాణలో తన ఉనికిని కోల్పోయిన టీడీపీ ఇక్కడ కూడా అధికారానికి దూరమైతే ఏపీలో టీడీపీ కూడా కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు. వయస్సు రీత్యా బాబు కూడా 2029 ఎన్నికలకు ఇప్పటి మాదిరి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొనలేరు. అలాగే బాబు కు మాదిరే ప్రతిపక్షంలో ఉండి పార్టీని నడపగల సమర్థత, అనుభవం లోకేష్ లో ఉన్నాయా అంటే..? కాబట్టి ఈ 2024 ఎన్నికలు వైసీపీ కి ఎంత ముఖ్యమో టీడీపీ కి కూడా అంతే అవసరం.

ADVERTISEMENT
Latest Stories