మూడు రాజధానుల పాట వినిపించడం లేదేమిటి?

3 Capitals YS Jaganఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సిఎం జగన్‌, ఆయన మంత్రులు రకరకాల స్వరాలలో మూడు రాజధానుల పాట పాడి వినిపించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయకుండా టిడిపి కుట్రలు చేసి అడ్డుకొంటోందంటూ మంత్రులు రోడ్లెక్కి నిరసన ర్యాలీలు, సభలు చేసి గర్జించారు. త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అయిపోతానంటూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సిఎం జగన్‌ పెట్టుబడిదారులను నమ్మించారు కానీ ఇంతవరకు షిఫ్ట్ అవలేదు!

ఆయనతో సహా అప్పుడు రోడ్లెక్కి నిరసన ర్యాలీలు చేసిన మంత్రులెవరూ కూడా మూడు రాజధానుల గురించి మాట్లాడటం లేదిప్పుడు. అంటే మూడు రాజధానుల వ్యూహం బెడిసి కొట్టిందని గ్రహించి సైలెంట్‌గా అటకెక్కించేశారా?అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే మూడు రాజధానులు ప్రతిపాదన వారి అధినేతదే తప్ప ప్రజలది కాదు. అదీ… రాష్ట్రాభివృద్ధి కోసం చేసిన ప్రతిపాదన కాదు. టిడిపి, జనసేనలకు చెక్ పెట్టడానికి పన్నిన వ్యూహం మాత్రమే.

ADVERTISEMENT

మూడు రాజధానుల వ్యూహంతో రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాలలో టిడిపి, జనసేనలను అడుగుపెట్టనీయకుండా చేయాలని వైసీపీ భావిస్తే వాటికి ప్రజలు జేజేలు పలుకుతుండటంతో తమ వ్యూహం బెడిసి కొట్టిందని వైసీపీ గ్రహించిన్నట్లే ఉంది. పైగా మూడు రాజధానుల విషయంలోనూ వైసీపీకి ఏమాత్రం ఆసక్తి, చిత్తశుద్ధి లేదనే విషయం స్వయంగా నిరూపించేసుకొంది కనుక దాని గురించి మాట్లాడితే తమకే నష్టమని అందరూ సైలంట్ అయిపోయిన్నట్లున్నారు. అందుకే చాలా రోజులుగా మూడు రాజధానుల పాట వినిపించడం లేదు.

అయితే ఇప్పుడు సైలంట్‌గా ఉండిపోయినా రేపు ఎన్నికలలో తప్పనిసరిగా మళ్ళీ అదే పాట పాడాల్సి ఉంటుంది కదా?ఐదేళ్ళు అధికారంలో ఉండి మూడు రాజధానులు ఏర్పాటు చేయలేనప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పగలరు?చెప్పినా ప్రజలు నమ్మరు కూడా.

కనుక ఏదో సాకు చెప్పి పాట పల్లవి మార్చి విశాఖ రాజధాని అనో లేదా అమరావతే రాజధాని అనో కొత్త పల్లవి అందుకొన్నా ప్రజలు అసలే నమ్మరు. వచ్చే ఎన్నికలలో రాజధాని అంశం హైలైట్ అయితే వైసీపీ నష్టపోతుంది. కనుక అది తప్పకుండా వేరే అంశాలని హైలైట్ చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తుంది. బహుశః అందుకేనేమో ‘సంక్షేమ పధకాల డప్పు’ గట్టిగా వాయిస్తోంది.

ఈవిషయం టిడిపి, జనసేనలు కూడా గ్రహించిన్నట్లే ఉన్నాయి. అయితే రాజధాని అంశం గురించి ఇప్పుడే వైసీపీని గట్టిగా నిలదీస్తే అది తప్పించుకొనేందుకు మరో దారి తప్పకుండా కనుగొంటుంది. కనుక ప్రతిపక్షాలు కూడా ‘అమరావతి-మూడు రాజధానులు’ విషయంలో నిశబ్ధం పాటిస్తున్నట్లు భావించవచ్చు.

కనుక వచ్చే ఎన్నిలలో తప్పనిసరిగా ‘అమరావతి రాజధాని’ ప్రధానాంశంగా ప్రతిపక్షాలు ప్రజాభిప్రాయం కోరవచ్చు. వచ్చే ఎన్నికలలోనే ప్రజలు కూడా రాజధానిపై తాడో పేడో తేల్చుకోవలసి ఉంటుంది లేకుంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది.

ADVERTISEMENT
Latest Stories