
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సిఎం జగన్ మొదలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు అందరూ అందినకాడికి దోచేసుకున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి.
కానీ వైసీపీలో అందరూ నీతినిజాయితీపరులే కనుక అవన్నీ ‘ఎల్లో మీడియా’ సృష్టించి చేస్తున్న దుష్ప్రచారమే.. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో నమోదు చేయిస్తున్న అక్రమ కేసులే.. అని అనుకోవడానికి కూడా లేకుండా చేసుకుంటున్నారు వైసీపీ నేతలు.
Also Read – ‘పాకీ’స్తాన్ బుద్దులు…!
ఇందుకు తాజా ఉదాహరణగా వైసీపీకి చెందిన బుట్టా రేణుక దంపతులు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వద్ద రూ.310 కోట్లు అప్పు తీసుకొని ఎగవేయడాన్ని చెప్పుకోవచ్చు.
ఆర్ధిక సమస్యల కారణంగా వారు ఆ అప్పు చెల్లించలేకపోయి ఉండవచ్చు. కనుక అందుకు వారిని తప్పు పట్టలేము.
Also Read – భారత్, పాక్లకు యుద్ధం అవసరమే?
ఆ రుణం కోసం వారు మాదాపూర్లోని 7,205 చ.గజాలలో నిర్మించిన బుట్టా కన్వెన్షన్ సర్వీసస్ లిమిటెడ్, బంజారాహిల్స్లో 5,000 చ. గజాల స్థలాలను ఎల్ఐసీ వద్ద తనఖా పెట్టారు కూడా.
వారు రూ.40 కోట్లు చెల్లించిన తర్వాత నెలసరి వాయిదాలు చెల్లించడం మానేశారు. కనుక ఎల్ఐసీ తన వద్ద ఉన్న వారి ఆస్తులను వేలం వేసి రూ.145 కోట్లు బకాయి జమ చేసుకోవాలని వేలం ప్రకటన జారీ చేసింది.
Also Read – బ్రహ్మాస్త్రాల ఫ్యాక్టరీ పెట్టేశారుగా!
హైదరాబాద్ నగర శివారులో భూములు వేలం వేస్తే పోటీ పడి మరీ కొనుగోలు చేస్తుంటారు. కానీ నగరం నడిబొడ్డున అత్యంత ప్రైమ్లో లొకేషన్లో ఉన్న బుట్టా దంపతుల భూములను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు!
బుట్టా అనుచరుల బెదిరింపులే కారణమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అత్యంత శక్తివంతమైన రాజకీయ నేతలైన వారి భూములను కొనుగోలు చేస్తే భవిష్యత్లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనే భయంతోనే ఎవరూ ముందుకు రావడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
తెలంగాణలో రాజకీయ నాయకులకు ఆ భయం ఉండదు కనుక వారిలో ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. కానీ వైసీపీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉండే సంబంధాల కారణంగా వారు కూడా ముందుకు రావడం లేదు.
అంటే బుట్టా దంపతులు ఎల్ఐసీ వద్ద నుంచి చాలా పద్దతిగానే రుణం తీసుకున్నారు. కానీ చాలా తెలివిగా ఎగవేస్తున్నారని అర్దమవుతోంది.
మొదటి వేలంపాటకి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎల్ఐసీ మరోసారి వేలంపాటకు నోటీస్ ఇవ్వబోతోంది. ఒకవేళ అప్పుడు కూడా బుట్టా భూములను ఎల్ఐసీ వేలం వేయలేకపోతే, దాని వద్ద ఉన్న వారి ఆస్తి పత్రాలు చిత్తు కాగితాలతో సమానమే కదా?
వైసీపీ నేతల అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాల గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ తప్పుడు వార్తలే అనుకున్నా ఈ ఎల్ఐసీ స్టోరీ కల్పితం కాదు కదా?
దేశ ప్రజల జీవితాలకు ఎల్ఐసీ భద్రత కల్పిస్తున్నామని చెప్పుకుంటుంది. కానీ బుట్టా దంపతులు దానికే భద్రత లేకుండా చేశారు కదా! వారి బుట్టలో పడి గిలగిలా కొట్టుకుంటోంది! దటీజ్ వైసీపీ!