టీమిండియా వన్డే క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షిపై సెక్షన్ 420 కింద కేసు నమోదైంది. ‘రితి ఎమ్ఎస్డీ అల్మోడే ప్రైవేట్ లిమిటెడ్’ అనే స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీకి సాక్షి, శుభావతి పాండే, ప్రతిమ పాండే, అరుణ్ పాండేలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీలో వీరందరికీ సమానమైన వాటాలు ఉన్నాయి. డెన్నిస్ అరోరా అనే వ్యక్తికి కూడా ఈ కంపెనీలో 39 శాతం వాటా ఉండేది. అయితే, కొన్ని కారణాల వల్ల అతను కంపెనీ నుంచి బయటకు వచ్చాడు.
ఒప్పందంలో భాగంగా, ప్రస్తుత డైరెక్టర్లకే తన వాటాను అమ్మేశాడు. ఇందులో భాగంగా అరోరాకి 11 కోట్లను డైరెక్టర్లు చెల్లించాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు 2.25 కోట్లు మాత్రమే వారు చెల్లించారు. ఈ ఏడాది మార్చిలోనే మొత్తం డబ్బులను చెల్లించాల్సి ఉన్నా, ఇంతవరకు సదరు మొత్తాన్ని ఇవ్వలేదు. దీంతో, ధోని భార్య సాక్షి సహా మిగతా వాళ్లెవరూ మిగతా డబ్బును తనకు చెల్లించలేదంటూ అతను కేసు వేశాడు. దీంతో, సాక్షిపై కూడా సెక్షన్ 420 కేసు నమోదైంది. అయితే, ఈ విషయంపై ఇంతవరకు అటు సాక్షి కాని, ఇటు ధోనీ కాని స్పందించలేదు.



