ఆనాడు విద్యా బాలన్ నటించిన డర్టీ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయినట్లే మళ్ళీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ కూడా సూపర్ హిట్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అవుతుండగా మరోపక్క దీనిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపిల మద్య మీడియాలో, సోషల్ మీడియాలో అదే స్థాయిలో జరుగుతున్న రాజకీయ యుద్ధాలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇంతగా పాపులర్ అయిన గోరంట్ల డర్టీ పిక్చర్లో రెండు కొత్త ట్విస్టులు వచ్చాయి. 1. ఆ వీడియౌ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారని ఇంతవరకు మంత్రులు, వైసీపీ నేతలు చెపుతుండగా, అసలు ఒరిజినల్ వీడియో దొరకనేలేదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పడం. 2. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్పై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రూ.10కోట్లకు పరువు నష్టం దావా వేయబోతుండటం.
ఏవైనా పెద్ద సినిమాలు విడుదలవుతుంటే వాటికి పైరసీ బెడద చాలా ఉంటుంది. కానీ గోరంట్ల డర్టీ పిక్చర్ ఒరిజినల్ వీడియో లేకుండా పైరసీ వీడియోలతోనే నడిచేస్తుండటం విశేషం. ఒరిజినల్ వీడియో లేనప్పుడు ఇంతకాలం ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉందని ఎందుకు అబద్దాలు చెప్పారని టిడిపి నేతలు జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు.
ఎస్పీ ఫకీరప్ప క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, రాధాకృష్ణలను ఉద్దేశ్యించి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన రాధాకృష్ణ ఆయనపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకొన్నారు.
డర్టీ పిక్చర్ కొన్ని రోజులు థియేటర్లలో ఆడిన తర్వాత వెళ్ళిపోయింది. కానీ ఈ డర్టీ పిక్చర్ ఇంకా ఎన్ని రోజులు సాగుతుందో, చివరికి ఎవరు విలన్గా నిలుస్తారో తెలీదు.



