టాలీవుడ్ అంటే ఇప్పుడు పాన్ ఇండియా మల్టీ స్టార్ సినిమాలు అనుకునే స్థాయికి ఎదిగిపోయింది. ఒక్కప్పుడు టాలీవుడ్ అంటే చిన్నచూపు చూసే బాలీవుడ్ హీరోలు సైతం తెలుగు సినిమాలలో నటించడానికి తహతహలాడుతున్నారంటే టాలీవుడ్ ఏ స్థాయికి ఎదిగిపోయిందో అర్దం చేసుకోవచ్చు. అలాగే తెలుగు దర్శకులతో బాలీవుడ్ హీరోలు హిందీ సినిమాలు చేస్తున్నారు. పెద్ద హీరోలు పెద్ద సినిమాలతో 2-3 ఏళ్ళు లాక్ అయిపోతుండటంతో ఇదే అదునుగా చక్కటి చిన్న సినిమాలు టకటకా వచ్చేస్తున్నాయి. క్లుప్తంగా ఇదీ.. టాలీవుడ్ ప్రసత పరిస్థితి.
అయితే టాలీవుడ్లో పెళ్ళిళ్ళు, విడాకులు, మాదక ద్రవ్యాలు, రేవ్ పార్టీలు, పోలీస్ కేసులు కూడా సమాంతరంగా సాగుతూనే ఉన్నాయి.
కొంత కాలం క్రితం రేవ్ పార్టీ కేసులో నటి హేమ పేరు మారుమ్రోగిపోగా, ఆ తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీలో బిఆర్ఎస్ నేత కేటీర్ బావమరిది రాజ్ పాకాల పేరు మారుమ్రోగిపోయింది.
ప్రేమించిన యువతిని మోసం చేశాడనే ఆరోపణలతో రాజ్ తరుణ్ పేరు, అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ పేరు మారుమ్రోగిపోయాయి.
తాజా సీజన్లో దర్శకుడు రాంగోపాల్ వర్మ, నటులు పోసాని కృష్ణ మురళి, శ్రీరెడ్డి ముగ్గురూ పోలీస్ కేసు దశలో ఉన్నారు. పోసాని, శ్రీరెడ్డి ఇద్దరూ లెంపలు వేసుకొని రాజకీయాలు వదిలిస్తామని హామీ ఇస్తున్న చట్టం తన పని తాను చేసుకుపోతూనే ఉంది.
వర్మ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసుకోగా ఆయన కేసు విచారణ బుధవారానికి వాయిదా పడింది. కనుక అంతవరకు అజ్ఞాతవాసంలోనే ఉండక తప్పదు.
టాలీవుడ్లో ఈ స్టోరీలన్నీ నడుస్తుండగానే తాజాగా నటుడు శ్రీ తేజ్పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. అతను తనని పెళ్ళి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఓ యువతి పిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీ తేజ్పై కేసు నమోదు చేసి నోటీస్ జారీ చేయనున్నారు.
అయితే ఈ కేసులు, న్యూసులు అన్నీ కాలక్షేపానికి బఠానీలు అన్నట్లు మిగిలిపోతున్నాయే తప్ప ఏ కేసు క్లైమాక్స్ చేరుకోకపోవడం కాస్త నిరాశ కలిగిస్తుంది.




