ప్రస్తుతం తెలుగు నాట మంచి అవకాశాలను తెచ్చుకుంటున్న అడవి శేష్ టాలీవుడ్ ‘కర్మ’ సినిమా ద్వారా పరిచయం అయిన విషయం చాలామందికి తెలియదు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “పంజా” సినిమాలో నెగటివ్ రోల్ చేసిన తర్వాత బాగా హైలైట్ అయిన శేష్ కు వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే తొలుత ఈ సినిమాలో నటించకూడదని భావించినట్లుగా తన ఫ్లాష్ బ్యాక్ సంగతులను తాజాగా చెప్పుకొచ్చారు.
అమెరికాలో సంపాదించిన డబ్బులతో మొదట్లో హైదరాబాద్ నుంచి ముంబైకి విమానాల్లో తిరిగానని, ఒంటరిగా తన “కర్మ” సినిమాను విడుదల చేసుకోవాలనే ప్రయత్నంలో జేబులు ఖాళీ అవ్వడంతో ఆ తర్వాత నుంచి ట్రైన్ లో వెళ్లేవాడిని సినిమా కష్టాలను వివరించారు. ‘కర్మ’ సినిమాలో తన నటన ఆకట్టుకున్నా, సినిమా ఆకట్టుకోకపోవడంతో ఖాళీగా ఉన్న సమయంలో ‘ఆర్కా మీడియా’కు చెందిన నీలిమా తిరుమలశెట్టి వద్దకు వెళ్లేవాడినని చెప్పాడు.
ఆ మాటల సందర్భంలో కన్నడ దర్శకుడు వష్ణువర్ధన్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ‘పంజా’ సినిమా తీస్తున్నామని, అందులో నటించమని అడిగగా, కథ విని నిర్ణయం చెబుతానని చెప్పి, తన కజిన్ బ్రదర్ అడవి సాయికిరణ్ తో ఆ విషయం చెప్పానని, అయితే తన అసలు ఉద్దేశం విలన్ గా నటించడం ఇష్టం లేదని అన్నాడు. అయితే తన సోదరుడు సాయికిరణ్ మాత్రం పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ అస్సలు వదులుకోవద్దని ఖచ్చితంగా చెప్పారు.
పవన్ సినిమాలు కొన్ని కోట్ల మంది చూస్తారు, నువ్వు కూడా వారందరికీ తెలిసిపోతావ్, నీ పెర్ఫార్మెన్స్ చూపించుకునేందుకు ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదని సలహా ఇవ్వడంతోనే “పంజా”లో విలన్ గా నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలిపాడు శేష్. తొలి రోజు షూటింగ్ లో బాలీవుడ్ నుంచి వచ్చాననుకుని పవన్ కళ్యాణ్ గారు తనను హిందీలో పలకరించారని, దీంతో వెంటనే ‘నేను తెలుగువాణ్ణే’ అని చెప్పానని, తనను బాగా ఎంకరేజ్ చేశారని నాటి అనుభూతులను పంచుకున్నారు.



