వైసీపీ నేతలు ధీమాగానే ఉన్నారు మరి ప్రభుత్వం?

Alliance Govt Fails To Arrest YSRCP Leaders In Liquor Scam

జగన్‌ హయంలో 5 ఏళ్ళపాటు నిరాటంకంగా మద్యం విక్రయాలు జరిగాయి. నిరాటంకంగా గోదాములలో రేషన్ బియ్యం మాయం అయ్యాయి. నిరాటంకంగా కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అయ్యాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు. కానీ ఈ అవినీతి పనులకు పాల్పడిన వైసీపీ నేతలను గుర్తించి, వారిపై కేసులు నమోదు చేసి విచారణకు రప్పించడానికి నేటికీ పోలీసులు అపసోపాలు పడుతున్నారు.

ADVERTISEMENT

మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని రప్పించలేక ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డిని పిలిచి కొడుకు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తుండటమే ఇందుకు చిన్న ఉదాహరణ.

ఇదే కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈరోజు విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావలసి ఉంది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి హైకోర్టులో ముందస్తు బెయిల్‌ తిరస్కరించడంతో ఆయన వెంటనే సుప్రీంకోర్టులో వేశారు.

గమ్మత్తైన విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టులో ఆయన బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 7న విచారణ జరిపినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తరపున న్యాయవాదులు ఎవరూ హాజరుకాలేదు! కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని భావించి సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

మద్యం కేసులో ఆయనని విచారణకి రప్పించాలని అనుకున్నప్పుడు, ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దని వాదించేందుకు ఎవరూ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు?

ఆయన ముందస్తు బెయిల్‌ సంపాదించుకున్నారు కనుక పిలవగానే రేపు (శనివారం) విచారణకు వస్తారనుకుంటే మళ్ళీ హైకోర్టులో మరో పిటిషన్‌ వేశారు.

విచారణ పేరుతో పోలీస్ అధికారులు తనని కొట్టి తిట్టవచ్చని కనుక విచారణ మొత్తం ఆడియో వీడియో రికార్డింగ్ చేయించాలని మిధున్‌ రెడ్డి కోరారు. కానీ హైకోర్టు నిరాకరించింది. అయితే ఆయన వెంట ఇద్దరు న్యాయవాదులను తీసుకు వెళ్ళవచ్చని వారిలో ఒకరు విచారణ జరుగుతున్న ప్రదేశానికి పడి అడుగుల దూరంలో కూర్చోవాలని, విచారణ, వాంగ్మూలం రికార్డ్ చేస్తున్నప్పుడు కన్యాయవాడులు జోక్యం చేసుకోరాదని షరతులు విధించింది.

గతంలో తాను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు పోలీసులు చంద్రబాబు నాయుడుని లేపేశారు (అరెస్ట్‌ చేశారు) అని జగన్‌ చాలా గొప్పగా చెప్పుకున్నారు. గవర్నర్ అనుమతి కూడా తీసుకోకుండా, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేయడానికి పోలీసులకు పెద్దగా సమయం పట్టలేదు.

కానీ చిన్న చిన్న కేసులలో కూడా వైసీపీ నేతలను కనీసం విచారణకి కూడా రప్పించలేకపోవడాన్ని ఏమనుకోవాలి? మద్యం కేసులో నిందితుడు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే, ఆ కేసు విచారణకు న్యాయవాదిని పంపకపోవడాన్ని ఏవిదంగా అర్ధం చేసుకోవాలి?

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కాకినాడ పోర్టు నుంచి 5 ఏళ్ళపాటు రేషన్ బియ్యం ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్వయంగా చెప్పారు. కానీ ఆయనపై కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు.

పవన్ కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ ఇద్దరూ కలిసి కాకినాడ పోర్టులో అంత హడావుడి చేసినా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పేరు ఎక్కడా వినపడలేదు. ఎందువల్ల? అవినీతికి పాల్పడటమే కాక తమ పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించిన వైసీపీ నేతలపై టీడీపీ ఇంత ఉదారంగా వ్యవహరిస్తుండటాన్ని ఏవిదంగా చూడాలి?

ADVERTISEMENT
Latest Stories