అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దలు ఊరికే అనలేదు.ఏదైనా మితంగా ఉంటేనే బాగుంటుంది. హద్దులు దాటిందా ముందు విసుగుతో మొదలై తర్వాత కంపరం దాకా వెళ్ళిపోతుంది. రీ రిలీజుల వ్యవహారం అచ్చంగా ఇలాగే తయారయ్యింది. ఇవాళ దేశముదురుని అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందే స్పెషల్ షోలను తెలుగు రాష్ట్రాల్లో వేశారు. ఇక్కడిదాకా బాగానే ఉంది. పోకిరితో మొదలైన ఈ సిరీస్ లో ఐకాన్ స్టార్ ది మొదటిసారి వస్తోంది కాబట్టి అభిమానులు భారీ హంగామా చేయాలని ముందే బలంగా డిసైడయ్యారు.
ఆరంజ్ లాంటి డిజాస్టరే మూడు కోట్లు వసూలు చేసి థియేటర్లను హౌస్ ఫుల్ చేయగా లేనిది దేశముదురు లాంటి హిట్ మూవీ ఇంకెంత సత్తా చూపించాలని మానసికంగా ముందే సిద్ధమయ్యారు. దానికి తగ్గట్టే అందరి అడ్డాగా చెప్పుకునే ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ఉదయం ఇంకా టిఫిన్ టైంకన్నా ముందే షోలు మొదలుపెట్టారు. సంధ్య 70 ఎంఎం లాంటి పెద్ద హాలు నిండిపోయింది. ఒకడు అత్యుత్సాహంతో చేసిన అల్లరికి తెరమీద చిరుగు పడింది. ఎంతలేదన్నా దాన్ని కొత్తగా మార్పించుకోవాలంటే 10 లక్షలకు పైగా ఖర్చయ్యేది వాస్తవం.
సరే జరిగిందేదో జరిగిందనుకుంటే సాయంత్రం తిరిగి అదే రచ్చ. ఈసారి ఏకంగా థియేటర్ లోపల బాణాసంచా కాల్చేశారు. దెబ్బకు పోలీసులు రంగప్రవేశం చేసి షోని అర్ధాంతరంగా ఆపేసి అల్లరిమూకలను చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ ప్రీమియర్ లోనే టాలీవుడ్ కు చెందిన పలువురు సెలబ్రిటీలున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంత హడావిడి చేశారు కాబట్టి మేమూ చేయాలి పవన్ కళ్యాణ్ టీమ్ ఇంత బాణాసంచా కాల్చింది కాబట్టి వాటిని మించి పేల్చి మేమూ వీడియోలు ట్విట్టర్ లో పెట్టి వైరల్ చేయాలనే అతితాపత్రయ ఫలితమిది.
దీనివల్ల సదరు నిర్మాతకు హీరోకు దర్శకుడికి ఒక వెంట్రుకలో పావంత కూడా నష్టం ఉండదు. డ్యామేజ్ జరిగితే దాన్ని భరించాల్సింది ఈ ఫ్యాన్సే. అసలు ఎప్పుడో ఆడేసి వెళ్ళిపోయి ఆన్ లైన్లో ఫ్రీగా దొరికే సినిమాలను ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకుంటున్నారో అంతు చిక్కని విషయం. పైగా ఏదో ప్రెస్టేజ్ పోతుందన్న తరహాలో టికెట్లు బల్క్ లో కొనడం వాటిని ఉచితంగా పంచి పెట్టడం ఇదో తంతుగా మారిపోయింది. ఈ వరస చూస్తుంటే కాలం చెల్లిన మందులను బ్లాక్ లో కొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టు ఉంది. గత ఆరేడు నెలలుగా ఈ ప్రహసనం సాగుతోంది. డిస్ట్రిబ్యూటర్ల అత్యాశకు ఫ్యాన్స్ ఎమోషన్లు బంగారు గుడ్లు పెట్టే బాతులా దొరికాయి.



