ఒక హీరో సినిమా వేడుకపై మరొక హీరో అభిమానులు హంగామా చేయడం సరైన పద్ధతి కాదు అన్న ఉద్దేశంతోనే… ‘సరైనోడు’ వేడుకపై పవన్ కళ్యాణ్ గురించి ‘చెప్పను బ్రదర్’ అని అన్నానని బన్నీ వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే నాటి నుండి పవన్ ఫ్యాన్స్ కు బన్నీ టార్గెట్ అయ్యాడన్న విషయం ‘డీజే’ టీజర్, ట్రైలర్ డిస్ లైక్స్ వంటి అంశాలలో బయటపడింది. అయితే బన్నీ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు ఎన్ని వచ్చాయో, విమర్శలు అన్నే వచ్చినప్పటికీ, తను తీసుకున్న ‘స్టాండ్’పై ఉన్నారని తాజాగా కూడా నిరూపణ అయ్యింది.
గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవి హీరోగా పరిచయమవుతున్న “జయదేవ్” ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరైన అల్లు అర్జున్ మైక్ పట్టుకోగానే అభిమానులు ‘డీజే డీజే’ అంటూ నినదించారు. అయితే అంతకుముందు రాఘవేంద్రరావు వంటి దర్శకదిగ్గజాలు వ్యాఖ్యానిస్తున్న సమయంలో కూడా బన్నీ అభిమానులు ‘డీజే డీజే’ అంటూ నినాదాలు చేసారు. దీంతో ‘సభ్య సమాజానికి తానొక సందేశం ఇవ్వాలని భావిస్తున్నాను… అంటూ అభిమానులను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.
“ఒక పబ్లిక్ ఫంక్షన్ చేస్తున్న సమయంలో విచ్చేసిన అతిధులు నాలుగు మంచి మాటలు చెప్తే చప్పట్లు కొట్టి అభినందించాలి గానీ, ‘డీజే డీజే’ అంటూ అరవడం సరైన సంస్కారం కాదు. అరవాల్సిన టైం ఒకటి ఒకటుంటుంది, ఆ చిన్న టైమింగ్ ను మీరు వినియోగించుకోండి” అంటూ ఫ్యాన్స్ కు ఓ చిన్న సైజ్ క్లాస్ పీకారు. ఇది ఒక్క బన్నీ ఆడియో వేడుకలోనే కాదు, ప్రతి అగ్ర హీరోల సినీ వేడుకలో రొటీన్ గా జరిగే విషయమే. అయితే ఏ హీరో కూడా తన ఫ్యాన్స్ కు సూచనలు చేయడానికి ఇష్టపడరు. కానీ అందులో బన్నీ ఓ రెండడుగులు ముందున్నారని చెప్పవచ్చు.



