పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్ పుష్పరాజ్ పోలీసులను, ప్రభుత్వాన్ని గడగడ లాడించాడు… అది సినిమాలో! కానీ బయట ప్రపంచం ఎప్పుడూ వేరేగానే ఉంటుంది. హైదరాబాద్, చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్తో సహా మొత్తం 23 మందిపై కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
గత ఏడాది సరిగ్గా ఇదే నెల అంటే డిసెంబర్ 4న అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో వేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగింది. దానిలో రేవతి అనే మహిళ చనిపోగా తొమ్మిదేళ్ళ వయసున్న ఆమె కుమారుడు శ్రీతేజ నలిగిపోయాడు.
ఆ తర్వాత చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్పై బయటకు రావడం, రాజకీయాలు, నష్టపరిహారం వగైరా విషయాలన్నీ అందరికీ తెలిసినవే. ఆ కేసులోనే పోలీసులు అల్లు అర్జున్ పేరుని ఏ-11గా ఛార్జ్ షీట్లో చేర్చారు.
అల్లు అర్జున్ వైసీపీ (నేత) మద్దతుదారు కనుకనే వైసీపీ లక్కీ నంబర్ 11 ఆయనకు కేటాయించి ఉండవచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అది అప్రస్తుతం!
ఈ కేసుపై ఏడాది పాటు విచారణ జరిపిన తర్వాత పోలీసులు ఛార్జ్ షీట్ వేయడాన్ని తప్పు పట్టలేము. ఇలాంటి హైప్రొఫైల్ మరియు సున్నితమైన అంశానికి సంబందించిన కేసులో విచారణ ఆషామాషీగా ముగించినా, ఆలస్యం చేసినా విమర్శలు తప్పవు. కనుక పోలీసులు పద్దతిగానే విచారణ పూర్తిచేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారని చెప్పవచ్చు.
ఈ కేసు వలన అల్లు అర్జున్ పేరు మళ్ళీ వార్తలలో మారుమోగుతుంది. కానీ వివేకా హత్య కేసునే నిందితులు 5-6 ఏళ్ళుగా సాగుతున్నపుడు, ఈ తొక్కిసలాట కేసు 10-15 ఏళ్ళు సాగినా ఆశ్చర్యం లేదు.
కానీ అల్లు అర్జున్ వైసీపీ (నేత) మద్దతుదారు అయినప్పటికీ రాజకీయ నాయకుడు కారు. కనుక వీలైనంత త్వరగా దీనిని ముగించుకొని బయటపడే ప్రయత్నం చేయవచ్చు.
ఇప్పటికే ఆయన బాధిత కుటుంబానికి భారీగా నష్టపరిహారం చెల్లించారు. శ్రీతేజ వైద్య చికిత్సకు అయ్యే ఖర్చు అంతా భరిస్తున్నారు. వారి కుటుంబానికి వర్తమానంలో, భవిష్యత్లో ఎటువంటి ఆర్ధిక సమస్యలు లేకుండా నష్టపరిహారాన్ని ఫిక్స్ డిపాజిట్ చేసి నెలనెలా వడ్డీ వచ్చేలా ఏర్పాటు చేశారు.
ఈ చర్యలన్నీ జరిగిన తప్పుకి అల్లు అర్జున్ బాధ్యత వహిస్తున్నారని ద్రువీకరిస్తున్నట్లే. కనుక న్యాయస్థానం వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని తీర్పు చెప్పే అవకాశం ఉంది. అదెప్పుడనేదే తేలాల్సి ఉంది.



