అల్లు అర్జున్ త్వరలో సొంత పార్టీతో రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త ప్రత్యక్షమైంది. క్షణాలలో అది వైరల్ అయ్యింది.
న్యూస్ పేపర్లు, టీవీలకు కూడా ఇది పాకింది. అల్లు అర్జున్ టీమ్ దీనిపై వెంటనే వాటిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. అల్లు అర్జున్ గురించి ఇటువంటి పుకార్లు, తప్పుడు వార్తలు సృష్టించవద్దని, ప్రచారం చేయవద్దని మీడియా, సోషల్ మీడియాని అల్లు అర్జున్ టీమ్ అభ్యర్ధించింది.
అసలు ఇటువంటి పుకార్లను ఎవరు సృష్టిస్తున్నారు?అంటే మీడియా లేదా వైసీపీకి సంబందించివారు అయ్యుండవచ్చని అర్దమవుతుంది.
మీడియాలో కొందరు వ్యక్తులు లేదా కొన్ని మీడియా సంస్థలు తమ పాపులారిటీ, లైక్స్, టిఆర్పీ రేటింగ్ పెంచుకోవడం కోసం ఇటువంటి పుకార్లు పుట్టిస్తుంటారు. కనుక ఇది వారి పనే అయ్యుండవచ్చు.
పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టేందుకు, అలాగే మెగా-అల్లు కుటుంబాల మద్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. వాటన్నిటి వెనుక వైసీపీ హస్తం ఉందని అందరికీ తెలుసు.
కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని చెప్పేందుకు దాని సొంత మీడియాలో వస్తున్న కధనాలే చక్కటి నిదర్శనం.
అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా విడుదలైనప్పుడు థియేటర్ల వద్ద వైసీపీ చేసిన హడావుడి, సోషల్ మీడియాలో వైసీపీ చేసిన అతి ఇందుకు మరో నిదర్శనంగా కనిపిస్తుంది.
కనుక అల్లు అర్జున్ రాజకీయాలలో ప్రవేశిస్తున్నారనే పుకారు కూడా బహుశః వైసీపీకి సంబందించినవారే సృష్టించి ఉండవచ్చని అనుమానించవలసి ఉంటుంది.
కానీ పుష్ప-2తో అల్లు అర్జున్ సినీ కెరీర్ పీక్కి చేరుకున్నప్పుడు ఆయన ఇటువంటి పిచ్చి ఆలోచనలు చేయరని అందరికీ తెలుసు.
అయినా అల్లు అర్జున్ రాజకీయాలలోకి వస్తున్నారని దుష్ప్రచారం చేయడం ద్వారా జనసేన కార్యకర్తలలో, పవన్ కళ్యాణ్ అభిమానులలో గందరగోళం అయోమయం సృష్టించడమే ఈ పుకారు ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
ఈ పుకారు సృష్టించినవారికి అల్లు అర్జున్ టీమ్ చెప్పుతో కొట్టిన్నట్లు వెంటనే జవాబు ఇచ్చింది. కనుక దీని వెనుక ఎవరున్నప్పటికీ ఇకనైనా ఇటువంటి నీచ రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిది. కానీ కుక్క తోక వంకరని ఎవరూ సారి చేయలేరు కదా?




