ఇటీవల కాలంలో తన కుటుంబానికి సంబంధించిన పుకార్లను సోషల్ మీడియా వేదికగా ఖండిస్తున్న ‘కింగ్’ నాగార్జున, తాజాగా చెలరేగిన రాజకీయ పుకారుపై మాత్రం ఎలాంటి స్పందన తెలియజేయలేదు. దీంతో వైసీపీలో నాగ్ చేరుతున్నారన్న ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ‘మౌనం అర్ధాంగీకారం’ అన్న నానుడి మాదిరి, నాగార్జున సైలెన్స్ ను వైసీపీ వర్గాలు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాయి.
అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందనే విషయం నాగ్ సతీమణి అమల చెప్పుకొచ్చారు. ప్రతిసారి తానే పుకార్లను ఖండిస్తుంటే కొత్తదనం లేదని ఫీల్ అవుతున్నారో లేక పొలిటికల్ సబ్జెక్ట్ కాబట్టి తాను మౌనం వహించడం సేఫ్ అనుకున్నారో ఏమో గానీ, ఈ సారి ఆ బాధ్యతను సతీమణి అమలకు ఇచ్చారు నాగ్. దీంతో ఈ పుకార్లను ఖండిస్తూ అమల ఓ స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారు.
2019 ఎన్నికల్లో కాదు, ఎప్పటికీ అసలు నాగార్జునకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, ఏ పార్టీలో చేరాలన్న ఆలోచనలు లేవని, సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను విశ్వసించవద్దని, ఒకవేళ అలాంటి ఆలోచనలు చేస్తే… ఖచ్చితంగా తామే ఓ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు తెలుపుతామని, రహస్యంగా చేయడానికి ఇందులో ఏమీ లేదని, అంత అవసరం మా కుటుంబానికి కూడా లేదని చెప్తూ… సదరు పుకార్లకు బ్రేకులు వేసారు అమల.



