అమరావతి నిర్మాణదశలో మరో కీలక అడుగు ఈ నెల 7న పడబోతోంది. అమరావతిలోని 1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సంబంధించిన కీలక ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఎస్.ఈశ్వరన్ల సమక్షంలో సీఆర్డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ), సింగపూర్ సంస్థల కన్సార్షియంకి చెందిన జాయింట్ వెంచర్ కంపెనీ ‘సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్స్ హోల్డింగ్స్(ఎస్ఏఐహెచ్) సంస్థల మధ్య ఆ రోజున ఒప్పందాలు జరగబోతున్నాయి.
సింగపూర్కి చెందిన అసెండాస్-సింగ్బ్రిడ్జి, సెంబ్కార్ప్ సంస్థల కన్సార్షియం స్విస్ ఛాలెంజ్ విధానంలో స్టార్టప్ ప్రాంతానికి మాస్టర్ డెవలపర్ గా ఎంపికైంది. ఈ కన్సార్షియాన్ని మాస్టర్ డెవలపర్గా ఎంపిక చేస్తూ 2017 మే 15న ఖరారు అయ్యింది… స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి ఆరోజే శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన జరిగి ఏడాదవుతున్నా క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు అమలు దిశగా ఒక్కడుగూ ముందుకు పడలేదు. న్యాయ, సాంకేతిక అంశాల్లో మరింత స్పష్టత కోసం ఇరు పక్షాలు పట్టుపట్టడం, కొన్నింటిలో త్వరగా ఏకాభిప్రాయానికి రాలేకపోవడం, ఒప్పందాల్లోని అంశాలను వివిధ దశల్లో క్షుణ్నంగా పరిశీలించడం వంటి కారణాలతో ప్రాజెక్టులో జాప్యం జరిగింది. మొత్తానికి ఇప్పుడు తొలి అడుగు పడబోతోంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని కన్సార్షియం ప్రతినిధులు చెబుతున్నారు.



