అదేమీ విశాఖ రాజధాని కాదు.. కనీసం 50-70 అంతస్తుల భవనం కూడా కాదు నిర్మించలేకపోవడానికి! కేవలం ఏడు అంతస్తుల భవనం మాత్రమే! జగన్ ప్రభుత్వం దానిని కూడా నిర్మించకుండా వదిలేసింది. అదే… అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయం!
జగన్ అమరావతి వద్దనుకున్నారు. కనుక అమరావతిలోని అన్ని భవనాలతో పాటు దానినీ పట్టించుకోకుండా వదిలేశారు.
అలా 5 ఏళ్ళు నిర్మాణానికి నోచుకోకుండా ఉండిపోయిన సీఆర్డీఏ కార్యాలయాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు చేయిస్తున్నారు.
సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న సీఆర్డీఏ కార్యాలయం ఈ నెల దసరా పండగ నాటికి ప్రారంభోత్సవం చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. దీనికి అనుబంధంగా మరో 1.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మరికొన్ని భవన సముదాయాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని చెప్పారు.
అమరావతి నిర్మాణ పనులన్నీ మూడేళ్ళలో పూర్తి చేయాలని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ముందే గడువు విధించారని, తప్పకుండా ఆలోగా పనులు పూర్తిచేస్తామని మంత్రి నారాయణ చెప్పారు.
జగన్ అమరావతిని వద్దనుకున్నా రాజధాని భూముల వ్యవహారాలన్నీ సీఆర్డీఏ ద్వారానే జరుగుతున్నాయి. కనుక కనీసం దానికి ఓ కార్యాలయం నిర్మించవచ్చు. ప్రభుత్వ కార్యకలాపాలకు అవసరమైన సీఆర్డీఏ కార్యాలయం నిర్మించలేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలు నిర్మించుకున్నారు.
రూ.494 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి విశాఖలో రుషి కొండపై తన కోసం విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు. వాటిలో లక్షలు, కోట్లు విలువచేసే ఫర్నీచర్, కమోడ్లు, వాష్ బేసిన్లు, లైట్లు, ఫ్యానులు, ఇతర గృహోపకరణాలతో నింపేయడం వలన ఆ భవనాలను ఏవిదంగా వాడుకోవాలో తెలీక కూటమి ప్రభుత్వం తల పట్టుకోవడం అందరికీ తెలుసు.
అంతటితో ఆ కధ ముగియలేదు. ఆ ప్యాలాస్లు కూటమి ప్రభుత్వానికి తెల్ల ఏనుగులా మారాయి కూడా. నేటికీ అవి నిరుపయోగంగా పడి ఉన్నా వాటికి ఏడాదికి కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు కట్టాల్సివస్తోందని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే చెప్పారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ జగన్ తన సదుపాయాలకు, తన పార్టీ ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే అమరావతి నిర్మాణానికి నడుం బిగించారు. అందువల్లే సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్దమవుతోంది.






