రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేనందున పదేళ్ళపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సిఎం చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వంత పాడారు. మాట తప్పని జగన్ తర్వాత ఎలా మాట మార్చారో అందరూ చూశారు.
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొనందునే, కేసీఆర్ సైతం దానిని వ్యతిరేకించలేకపోయారు. ఆంధ్రా పాలకులను తీవ్రంగా అసహ్యించుకునే కేసీఆర్ వారితో అయిష్టంగానైనా సర్దుకుపోక తప్పలేదు.
కేసీఆర్ హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా అంగీకరించవలసి రావడానికి, జగన్ అమరావతిని వద్దనుకోవడానికి మద్య తేడా రాజధానికి చట్ట బద్దత అని అర్దమవుతోంది.
కానీ సాక్షాత్ ప్రధాని మోడీ చేత అమరావతికి భూమిపూజ జరిపించి, నిర్మాణ పనులు ప్రారంభించినందున ఇక అమరావతిని ఎవరూ ఆపలేరని చంద్రబాబు నాయుడు భావించి ఉండొచ్చు. అంతా మాత్రాన్న జగన్ అమరావతిని వద్దనుకున్నా కేంద్రం పట్టించుకోదనే విషయం కూడా స్పష్టమైంది.
మళ్ళీ ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణ పనులను ప్రధాని మోడీ చేతనే పునః ప్రారంభిజేశారు. కానీ గత అనుభవం దృష్టిలో పెట్టుకొని ఈసారి ‘ఆంధ్రప్రదేశ్కు అమరావతి మాత్రమే ఏకైక రాజధాని’గా ఉండాలని విభజన చట్టంలో సవరణ చేయించాలని నిర్ణయించారు.
ఈ ప్రతిపాదనకు ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. దీనిపై కేంద్రానికి కూడా ఎటువంటి అభ్యంతరం ఉండదు కనుక చట్ట సవరణ చేయడం ఖాయమే అని భావించవచ్చు.
తద్వారా భవిష్యత్లో ఎవరూ కూడా అమరావతిని కాదనలేరు. ఒకవేళ కాదన్నా ఆంధ్రాకు అమరావతి ఏకైక రాజధాని అని విభజన చట్టంలో నిర్దిష్టం పేర్కొనబడుతుంది కనుక ఈ విషయంలో ఎటువంటి మార్పులు సాధ్యం కావు.
ఒకవేళ ఎవరైనా అటువంటి ప్రయత్నాలు చేస్తే న్యాయస్థానాలలో సవాలు చేయవచ్చు. న్యాయస్థానాలు కూడా ఆ చట్టాన్నే గుర్తిస్తాయి. సమర్ధిస్తాయి. అనుగుణంగానే తీర్పులు చెపుతాయి. కనుక రాజధాని మార్పుని న్యాయస్థానాలు కూడా అంగీకరించవు.
ఇప్పటికైనా సిఎం చంద్రబాబు నాయుడు ఈవిదంగా అమరావతిని చట్ట బద్దంగా లాక్ చేయడం చాలా మంచి నిర్ణయమే. గత అనుభవాల దృష్టా ఇది చాలా అవసరం కూడా.




