రాష్ట్ర విభజన తర్వాత ఏపీ దయనీయ పరిస్థితిలో ఉన్నప్పుడే సిఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఆ సమస్యలన్నిటినీ నిబ్బరంగా ఎదుర్కొంటూనే అమరావతి నిర్మాణానికి పూనుకోవడం చాలా సాహసోపేతమైన నిర్ణయమే అని అందరూ అంగీకరిస్తారు.
ఐదేళ్ళ జగన్ విధ్వంస పాలన తర్వాత మళ్ళీ అటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటూ అమరావతి పునర్నిర్మాణానికి పూనుకోవడమే కాకుండా 2014-2019లో అసంపూర్తిగా మిగిలిపోయిన మెట్రో వంటి ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు.
వీటితో పాటు భోగాపురం విమానాశ్రయం, పోర్టుల నిర్మాణ పనులు చురుకుగా జరిపిస్తున్నారు. సంక్షేమ పధకాలపై తనకు మాత్రమే సర్వహక్కులు ఉన్నాయనే భ్రమలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా నివ్వెరపోయేలా అనేక పధకాలను ఇంకా గొప్పగా అమలు చేస్తున్నారు కూడా.
జగన్ హయంలో ఏపీ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడిన పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడిదారులకు నచ్చజెప్పి, భరోసా ఇచ్చి రప్పిస్తున్నారు. అంటే ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా కూడా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ముందుకే సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ వయసులో ఇన్ని ఆలోచనలు కలిగి ఉండి ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుండటం మామూలు విషయం కాదు. కానీ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చేసి చూపిస్తున్నారు.
ఈ శ్రమ సరిపోదన్నట్లు మరో 20-30 వేల ఎకరాలు సేకరించి అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ సిటీలు నిర్మించేందుకు శ్రమిస్తున్నారు. రాజధాని అమరావతి నగరాన్నే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తుంటే దానిలో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్వాంటమ్ వ్యాలీ.. దానికి నభూతో నభవిష్యత్ అన్నట్లు ఐకానిక్ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేయిస్తున్నారు.
అయితే పెద్ద పెద్ద కలలు కనడం ఎంత అవసరమో, అలాగే వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడం కూడా అంతే అవసరం.
చంద్రబాబు నాయుడు అమరావతి ఆలోచన చేసి దానిని కార్యరూపంలోకి తెచ్చేందుకు ఎంతగా శ్రమించారో కానీ ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. కనుక ఇప్పుడూ 2029 ఎన్నికల నాటికి పూర్తిచేయగల పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాటిని పూర్తిచేయడం చాలా అవసరం.
ఎందువల్లనంటే, జగన్ నేటికీ తాను చాలా బలంగానే ఉన్నానని, తాను మాత్రమే ప్రజలకు మేలు చేశానని నిరూపించుకొని ప్రజల మనసులు గెలుచుకునేందుకు రాజకీయాలు చేస్తూనే ఉన్నారనే విషయం విస్మరించకూడదు. కనుక ప్రజలు మళ్ళీ ఆ జగన్మాయలో పడకూడదంటే 2029 ఎన్నికల నాటికి అమరావతి, పోలవరంతో సహా చెప్పటిన పనులను పూర్తి చేసి చూపించడం చాలా చాలా అవసరం. ఆ తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు భుజానికి ఎత్తుకున్నా పర్వాలేదు.






