చనిపోయి దశాబ్దాలు గడిచినా ఇప్పటి రాజకీయాలలో కూడా తనదైన రాజకీయ ప్రస్తావన, రాజకీయ ముద్ర వేస్తున్న ఎక్కైక వ్యక్తి వంగవీటి మోహన రంగా. ఎమ్మెల్యే గా పనిచేసింది కొంతకాలమే అయినప్పటికీ ఆయన నాయకత్వం పై, రాజకీయ జీవితం పై అటు ప్రజలలో ఇటు రాజకీయ పార్టీలలో చర్చ జరుగుతూనే ఉంది.
ఎన్నికల సమయం దగ్గర పడిన నాటి నుండి రంగా హత్య మీద రాజకీయ విమర్శలు మొదలవడం, ఆయన పేరు చెప్పుకుని ఓటు బ్యాంకు రాజకీయాలతో పబ్బం గడపుకోవడం పరిపాటిగా మారిపోయింది వైసీపీ పార్టీలోని కొందరి నాయకులకు. సత్తెనపల్లిలో నిర్వహించిన రంగా వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి మాట్లాడుతూ రంగా మీద టన్నుల్లో ప్రేమ, కేజీలలో సానుభూతి కురిపించారు.
ఈయన గారికి ఈయన పార్టీకి రంగా మీద ప్రేమ, సానుభూతి ఉంటుంది కానీ రంగా వారసుడి మీద గౌరవం మాత్రం ఉండదు. టీడీపీ పార్టీ కుట్ర రాజకీయాలకు రంగా బలైపోయాడు అంటూ ముసలి కన్నీరు కారుస్తున్న అంబటికి రంగా హత్యలో ముఖ్య నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న దేవినేని కుటుంబసభ్యులకు ఇప్పుడు రాజకీయ వసతి కల్పించిన నాయకుడు ఎవరో, ఆ పార్టీ ఏంటిదో తెలియదా..? అంటూ నిలదీస్తున్నారు రంగా అభిమానులు.
రంగా వారసుడిగా రాజకీయాలలో అడుగుపెట్టిన రంగా కుమారుడు వంగవీటి రాధా ను పార్టీ నుండి పొమ్మనలేక పొగపెట్టి, రంగా ప్రత్యర్థులకు అవకాశం కల్పించింది జగన్ మోహన్ రెడ్డి కాదా.?రంగా రాజకీయ జీవితం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన గౌతమ్ రెడ్డికి స్థానికంగా పెద్ద పీఠ వేసి పార్టీలో గౌరవ స్థానం కల్పించడమేనా రంగా కు వైసీపీ పార్టీ ఇచ్చే గౌరవ ప్రదమైన నివాళి అంటూ రాధా – రంగా అభిమానులు అంబటికి చురకలు వేస్తున్నారు.
ఏ రాజకీయ హత్యలకైనా పార్టీలు కారణం కావు పార్టీలోని కొందరు వ్యక్తులే కారణమవుతారు. మా తండ్రి చావుకి కారణమైన వ్యక్తులు అప్పట్లో టీడీపీ పార్టీలో ఉన్నారు అందుచేతనే నేను వైసీపీ కండువా కప్పుకున్నాను. కానీ ఇప్పుడు అదే నేతలకు జగన్ ఆశ్రయం కల్పించడంతో నేను టీడీపీ పార్టీ పక్షాన నిలబడ్డాను అంటూ ఒక సందర్భంలో రంగా కుమారుడు రాధా స్వయంగా మీడియా ముందు ప్రకట చేశారు. టీడీపీ పార్టీకి రంగా హత్యకు ఎటువంటి సంబంధం లేదని రాధా తేల్చి చెప్పారు.
రంగాను పొగుడుతూ ఆయన కుమారుడిని అవమానించడం, అలాగే రంగా కులాన్ని అడ్డుపెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం వైసీపీ పార్టీకే చెల్లింది అంటున్నారు కప్పు నేతలు. అయినా తన తండ్రి చావుకి కారణం అంటూ ఆరోపించిన వ్యక్తికీ జగన్ పిలిచి రాజ్యసభ సీటు ఇవ్వొచ్చుకాని రాధా టీడీపీ పార్టీలో చెరకుడదా.?దీనికి సమాధానం చెప్పండి మంత్రి గారు అంటూ అంబటి పై ఎదురుదాడి చేస్తున్నారు కాపు నేతలు, రంగా అభిమానులు.
రాజకీయ హత్యలను రెండు కులాలకు ఆపాదిస్తూ, రెండు కులాల మధ్య గొడవలు రాజకీయ విద్వేషాలు సృష్టించి రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలంటూ అంబటికి రంగా అభిమానులు హితవు పలుకుతున్నారు.




