అక్రమార్జనను గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు తరలించి పన్నును ఎగవేసిన భారత నల్ల కుబేరుల జాబితాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పేరు వెలుగు చూడటం పెను కలకలమే రేపింది. అమితాబ్ తో పాటు ఆయన కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్ పేరు కూడా ఈ జాబితాలో ఉండటంపై దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురైంది. అయితే ఈ ఆరోపణలను ఖండించిన వీరిద్దరికీ కెరీర్ పరంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
ఇదిలా ఉంటే, అసహనంపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ ‘మిస్టర్ పెర్ ఫెక్షనిస్ట్’ అమిర్ ఖాన్… ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్ హోదాను కోల్పోవడం, అమీర్ స్థానంలో అమితాబ్ ను ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చేయడం జరిగిపోయింది. ఈ విషయంపై అధికారిక ప్రకటనే ఒక్కటే తరువాయి అన్న రీతిలో ప్రచారం జరుగుతున్న తరుణంలో… పనామా పేపర్స్ లో అమితాబ్ పేరు వెలుగు చూడడంతో ప్రస్తుతం ప్రభుత్వం డైలామాలో పడిందని సమాచారం.
పనామా పేపర్స్ వెల్లడించినట్లు అమితాబ్ పన్నును ఎగవేసి తన సంపాదనను విదేశాలకు తరలించారా? లేదా? అన్న విషయంపై స్పష్టత వచ్చిన తర్వాతే దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్ గా దాదాపుగా ఖరారైన అమితాబ్ పేరును ప్రస్తుతానికి ‘హోల్డ్’లో పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి.



