ఇటీవలే తెలంగాణ ఎన్నికలలోని ఫలితాలతో షాక్ కు గురైన బీజేపీ హై కమాండ్ రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్ లను నియమించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మురళీ ధరన్, సునీల్ దేవ్దర్, తెలంగాణకు అరవింద్ లింబావలీలను లోక్సభ ఎన్నికల ఇన్చార్జులుగా బీజేపీ నియమించింది. 2019 లోక్సభ ఎన్నికలకు వీరు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారు. తొందర్లో వీరిద్దరూ బాధ్యతలు చేపడతారు. రెండు రాష్ట్రాల నుండీ కనీసం 2014 ఎన్నికలలో గెలిచిన ఎంపీ సీట్లను అయినా నిలుపుకోవాలని బీజేపీ తాపత్రయం.
[m9ad]
అయితే ప్రస్తుత పరిస్థితిలో రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి కనీసం ఒక్క సీటు కూడా దక్కించుకోవడం కష్టమని పరిశీలికుల అభిప్రాయం. తెలంగాణలో ఉన్న కొద్ది పాటి అవకాశాలు కూడా ఇటీవలే వచ్చిన ఘోరమైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తుడిచి పెట్టుకుపోయాయి. ఈ క్రమంలో ఈ కొత్త నియామకాలు బీజేపీ భాగ్యరేఖలు ఏమైన మారుస్తారేమో చూడాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈసారి బీజేపీ విడిగానే ఎన్నికలకు వెళ్ళాల్సి రావచ్చు. 2014 ఎన్నికలలో ఆ పార్టీ టీడీపీతో కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే.
అయితే ఎన్నికల తరువాత కేంద్రంలో అవసరం అయితే తెలంగాణాలో తెరాస, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సాఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీలు మద్దతు ఇస్తాయని ఆ పార్టీ భావిస్తుంది. ముస్లిమ్ ఓట్లు పోతాయనే భయంతో తెలంగాణాలో, ప్రత్యేక హోదా వివాదం వల్ల ఆంధ్రప్రదేశ్ లోను బీజేపీకి ఎన్నికల ముందు పొత్తులు కుదిరేలా లేవు. ఇప్పుడు ఎన్ని మార్పులు చేసినా ఎన్నికలకు ఇంకా కేవలం ఐదు నెలలు మాత్రమే ఉండడంతో పార్టీ ఫలితాలు పెద్దగా ప్రభావితం అయ్యే అవకాశం కనిపించడం లేదు.



