ఆంధ్రప్రదేశ్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. సీఎన్బీసీ టీవీ 18 అందించే ‘స్టేట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఆంధ్రప్రదేశ్ సొంతం కాగా, మార్చి 23న ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుల్లో భాగంగా ఈ పురస్కారం అందజేస్తారు. బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాల జాతీయ స్థాయి ప్రముఖుల జ్యూరీ ఈ అవార్డుకు ఏపీని ఎంపిక చేసింది. వారిలో హెచ్డీఎఫ్సీ సీఎండీ ఆదిత్య పురి, ఎస్బీఐ సీఎండీ అరుంధతి భట్టాచార్య, కేకేఆర్ సంస్థ సీఈవో సంజయ్ నాయర్ తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు.
రెండున్నర ఏళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తోన్న యంత్రాంగం రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఎంతో కష్టపడుతోందని, అన్ని రంగాల్లోనూ ఏపీ అభివృద్ధి సాధిస్తోందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. విద్యుత్ వినియోగం, సరఫరా, నీటి పారుదల, గ్రామీణ అభివృద్ధి వంటి అనేక అంశాల్లో దేశంలోనే మన రాష్ట్రం ముందంజలో ఉందని, రాష్ట్రంలో వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఆచరణ సాధ్యమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లడం వంటి పలు అంశాలను జ్యూరీ సభ్యులు పరిశీలించారని అన్నారు.


