మన దేశంలో ప్రభుత్వోద్యోగం సంపాదించడం ఓ కల. దాని కోసం రేయింబవళ్ళు చదువుతూ, శిక్షణ పొందుతూ ఎదురు చూపులు చూసేవారు కోట్ల మంది ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా లక్షలమంది నిరుద్యోగులున్నారు.
ఒక్కో ప్రభుత్వ విధానం ఒక్కోలా ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కంటే సంక్షేమ పధకాలు అమలుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలండర్ ప్రకటించి.. దాని ప్రకారం ఎప్పటికప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్స్ జారీ చేస్తూ ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. గత ప్రభుత్వ నిర్వాకం వలన రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోగా, కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల సంఖ్యని గణనీయంగా తగ్గించేందుకు కృషి చేస్తోంది.
దీని కోసం ప్రభుత్వం రెండు విధానాలు అమలుచేస్తోంది. 1. ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలను ప్రోత్సహిస్తూ లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడం. 2. ప్రభుత్వోద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండటం. వీటి కోసం వయోపరిమితిని గణనీయంగా పెంచి వీలైనంత ఎక్కువ మంది నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం.
యూనిఫారం (పోలీస్ వగైరా) ఉద్యోగాలకు ఇదివరకే వయోపరిమితిని రెండేళ్ళు పెంచింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
నాన్ యూనిఫారం ఉద్యోగాలకు వయోపరిమితిని ఒకేసారి ఏకంగా పదేళ్ళు పెంచింది. ప్రస్తుతం వయోపరిమితి 34 ఏళ్ళు కాగా ప్రభుత్వం దానిని 44 ఏళ్ళకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 12 నెలల పాటు అమలులో ఉంటుంది.
కనుక ఏళ్ళ తరబడి ప్రభుత్వోద్యోగాలు సాధించేందుకు కోచింగ్ తీసుకుంటూ, వయోపరిమితి కారణంగా అవకాశం కోల్పోతున్న నిరుద్యోగ యువతకు ఇదో గొప్ప అవకాశమే. ఇప్పుడు ప్రభుత్వం జాబ్ క్యాలండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తోంది కూడా.
మంత్రి నారా లోకేష్ ఈ మూడేళ్ళలో మరో మూడు డీఎస్సీలు తీస్తామని చెప్పారు. అలాగే గ్రూప్ ఉద్యోగాలు, పోలీస్ శాఖలో మరో భారీ రిక్రూట్మెంట్ ఉంటుందనే సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. కనుక గత ప్రభుత్వ విధానాల వలన ఉద్యోగాలు సాధించలేక నిరుద్యోగులుగా మిగిలిపోయిన రాష్ట్రంలో యువతకు ఇది గొప్ప అవకాశమే!





