ఆంధ్రప్రదేశ్ లో మునిసిపల్, మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అధికార పార్టీకి పూర్తిగా అనుకూలంగా వచ్చాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూల్ మునిసిపల్ కార్పొరేషన్లలో ఫలితాలు తమకు అనుకూలంగా రావడం తమ మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతు అని అధికారపార్టీ చెప్పుకొస్తుంది.
అదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న టీడీపీ, వామపక్షాలకు అనుకూలంగా ఫలితాలు లేవు. విశాఖపట్నంలోని బీజేపీకి ఒక డివిజన్ రావడం గమనార్హం. బీజేపీకి మద్దతు ఇస్తున్న జనసేన కు కొన్ని సీట్లు వచ్చాయి. అలాగే తెరవెనుక మద్దతు ఇస్తూ… బయటకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ వైపు ప్రజలు నిలిచారు.
మూడు రాజధానులు విశాఖ, కర్నూల్ ప్రజలు మద్దతు ఇచ్చారంటే సరే అనుకోవచ్చు… దాని వాళ్ళ నష్టపోయే విజయవాడ, గుంటూరు జిల్లాలలో కూడా అధికారపార్టీకి అనుకూల ఫలితాలు రావడం గమనార్హం. అది కూడా సరే అనుకుంటే… విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం కూడా పెద్దగా ప్రభావం చూపించకపోవడం మింగుడుపడని అంశం.
“ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సామాజిక స్పృహ కొరవడింది. ప్రభుత్వం ఇచ్చే ఉచితాలను తప్ప ఏవీ పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు. పరిస్థితి ఇలా ఉంటే… మరిన్ని అంశాలలో ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం లైట్ తీసుకుని స్టీల్ ప్లాంట్ వంటి పనులు చేస్తుంది. అప్పుడు కూడా ప్రజలు స్పందిస్తారో లేదో అనుమానమే,” అని విశ్లేషకులు ఆవేదన చెందుతున్నారు.





