త్వరలో ఏపీ శాసనసభ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి. కనుక అప్పుడే మీడియా సంస్థలు ‘ఒపీనియన్ పోల్’ సర్వేలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలియజేస్తున్నాయి. ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ న్యూస్, సీ ఓటర్తో కలిసి నిర్వహించిన తాజా సర్వేలో నరేంద్రమోడీ, రాహుల్ గాంధీలలో దేశానికి ఎవరు ప్రధానిగా ఉండాలని కోరుకొంటున్నారు?అని సర్వే చేయగా, ఆంధ్రాలోని 56%, తెలంగాణలో 50% ప్రజలు మళ్ళీ నరేంద్రమోడీ ప్రధానిగా ఉండాలని కోరుకొన్నారని తెలిపింది.
అదేవిదంగా ఏపీలో 34%, తెలంగాణలో 40% మంది ప్రజలు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకొంటున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏపీ, తెలంగాణ ప్రజలు బీజేపీని పెద్దగా పట్టించుకోకపోయినా రాహుల్ గాంధీ కంటే నరేంద్ర మోడీయే ప్రధానిగా సరైన వ్యక్తి అని భావిస్తుండటం ఆలోచింపదగ్గ విషయమే. దీనికి బలమైన కారణమే కనిపిస్తోంది.
లోక్సభ ఎన్నికలను ఇంకా అనేక అంశాలు ప్రభావితం చేయవచ్చు గాక కానీ కేంద్రంలో ఏ పార్టీ, కూటమి అధికారంలోకి రావాలి? దాని ప్రధాని అభ్యర్ధి ఎవరు?అనే రెండు ప్రధాన పాయింట్స్ ఆధారంగానే లోక్సభ ఎన్నికలు జరుగుతుంటాయి. కనుక దేశ ప్రజలు మోడీ, రాహుల్ గాంధీలో ఎవరు సమర్ధుడు?అని ఆలోచించి ఇద్దరిలో ప్రధానిగా మళ్ళీ నరేంద్రమోడీకి మొగ్గు చూపడం సహజమే.
ఏపీ ప్రజలు మళ్ళీ మోడీయే ప్రధాని కావాలని కోరుకొంటున్నప్పుడు, శాసనసభ ఎన్నికలలో ఏపీ బీజేపీని ఎందుకు గెలిపించడం లేదు?అంటే వారు వైసీపి, టిడిపి, జనసేనలు చాలనుకోవడం వలననే. అయితే ఏపీ బీజేపీ వాటికి ప్రత్యామ్నాయంగా బలపడేందుకు బీజేపీ అధిష్టానం సహాయపడకపోవడం కూడా ఓ కారణమే.
దీనికి ఓ బలమైన కారణమే కనిపిస్తోంది. బీజేపీ అధిష్టానానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గెలిచి అధికారంలోకి రావడం కంటే కేంద్రంలో అధికారంలోకి రావడమే ముఖ్యమనుకోవడం వల్లనే. అందుకే ఏపీ బీజేపీని అధిష్టానం పట్టించుకోలేదు. అందుకే ప్రజలు పట్టించుకోవడం లేదని చెప్పొచ్చు.




