ఓడి గెలుస్తున్న జనసేనాని!

Andhra-Pradesh-Politics-Pawan-Kalyan-JanaSena

తెలంగాణలో ఏం జరిగేది?అంటే అభివృద్ధి అని సమాధానం వినిపించేది. మరి ఏపీలో ఏం జరుగుతోంది?అంటే రాజకీయాలు… ప్యూర్ రాజకీయాలు మాత్రమే అని చెప్పుకోవలసి ఉంటుంది.

మరో వారం రోజులలో 2023 ముగుస్తుంది. కనుక జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ 2023లో రాష్ట్ర రాజకీయాలలో రాణించారా? రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేశారా లేక తానే ఓ ప్రవాహంలో కొట్టుకుపోయారా?అని ఓ సారి రీవైండ్ చేసి చూడాల్సిన సమయం ఇదే.

ADVERTISEMENT

ఏపీలో రాజకీయాల నుంచి కులాలను విడదీయలేమని గ్రహించి ఆయన కూడా కులసంఘాల పెద్దలతో సమావేశమవుతూ పార్టీకి వారి మద్దతు కూడగట్టుకోవడం పవన్‌ కళ్యాణ్‌లో ఆలోచనలో ఓ కొత్త మార్పే!

వారాహి విషయంలో ఏపీ మంత్రులు, వైసీపి ఎమ్మెల్యేలు ఆయనతో ఓ ఆట ఆడుకొన్నారు. కానీ అదే వారాహితో రాష్ట్రంలో పర్యటించినప్పుడు పవన్‌ కళ్యాణ్‌ వారిని ఉక్కిరిబిక్కిరి చేశారు.

ముఖ్యంగా మహిళల అక్రమ రవాణాలో వాలంటీర్ల పాత్ర, వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించడం, ఒంటరి మహిళలపై వాలంటీర్ల అకృత్యాలు, ప్రభుత్వ పధకాలు అందించడంలో వాలంటీర్ల చేతివాటం వంటి తీవ్ర విమర్శలు, ఆరోపణలతో జనసేనాని వైసీపి ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చారు.

ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేల భూకబ్జాలు, ఇసుక, మద్యం మాఫియాలు, వైసీపి ప్రభుత్వం మద్యం వ్యాపారాలు… ఇలా అనేక అంశాలపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన నిశిత విమర్శలు, ఆరోపణలతో వరుసపెట్టి షాకులు ఇస్తూనే ఉన్నారు.

వారాహి యాత్రలలో పవన్‌ కళ్యాణ్‌ ఎంచుకొన్న అంశాలు, వాటి గురించి మాట్లాడిన తీరు చూసినప్పుడు రాజకీయంగా చాలా పరిపక్వత సాధించారనిపించింది. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం గురించి సిఎం జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడిన మాటలకు పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన సమాధానాలతో వారినే ఆత్మరక్షణలో పడేశారని రాజకీయ విశ్లేషకులు భావించారు.

అలాగే టిడిపితో దోస్తీ గురించి జగన్, ఆయన మంత్రులు చేస్తున్న విమర్శలకు కూడా “నాకు అంత సీన్ లేదని మీరు భావిస్తున్నప్పుడు మమ్మల్ని చూసి భయపడటం దేనికి?”అంటూ పవన్‌ కళ్యాణ్‌ ఘాటుగా సమాధానాలకు నేటికీ వైసీపిలో ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.

జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టగానే పవన్‌ కళ్యాణ్‌ రాజమండ్రి వచ్చి ఆయనను పరామర్శించి, అక్కడికక్కడే టిడిపి-జనసేనలు ఎన్నికలలో కలిసి పనిచేస్తాయని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం సృష్టించారు. ముఖ్యంగా టిడిపి కష్టకాలంలో అందరి కంటే ముందుగా పవన్‌ కళ్యాణ్‌ వచ్చి పెద్ద దిక్కుగా నిలబడటాన్ని ప్రజలు, పవన్ అభిమానులే కాదు… టిడిపి నేతలు, కార్యకర్తలు కూడా ఎంతగానో సంతోషించారు, మెచ్చుకొన్నారు కూడా.

టిడిపితో పొత్తు ప్రకటించేసి ఏపీ బీజేపీ ఏ గట్టున ఉండాలో తేల్చుకోమని చెపుతూనే పనిలో పనిగా వైసీపికి కూడా పెద్ద షాక్ ఇచ్చేశారు.

తెలంగాణలో బీజేపీతో పొత్తులు జనసేనకు మరో చేదు జ్ఞాపకాన్ని, చేదు అనుభవాన్నిమిగిల్చాయి. ఆ ఎన్నికలలో జనసేన డిపాజిట్లు కోల్పోయి నవ్వులపాలైంది. అయితే పవన్‌ కళ్యాణ్‌ బహుశః దీనికి ముందే మానసికంగా సిద్దం అయ్యారో ఏమో… ఆ ఫలితాలను పట్టించుకోకుండా వెంటనే ఏపీ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు.

టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేస్తున్నాయనే విషయం పార్టీలో ప్రతీ ఒక్కరూ గమనించాలని, మిత్రపక్షమైన టిడిపిని గౌరవించాలని లేకుంటే పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్లే భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకొంటానని పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించి జనసేనను గాడిన పెట్టుకొన్నారు. అదే సమయంలో జనసేన టిడిపి వెనక నడవడం లేదని, కలిసి పక్కనే నడుస్తుందని పవన్‌ కళ్యాణ్‌ చెప్పడం ద్వారా టిడిపి నేతలు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించబోమని సున్నితంగా చెప్పారు.

పవన్‌ కళ్యాణ్‌ చొరవతోనే టిడిపి, జనసేనల సమన్వయ కమిటీల సమావేశాలు, సమిష్టి కార్యాచరణలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఇవి రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేసేందుకు చాలా తోడ్పడుతున్నాయి కూడా.

టిడిపి, జనసేనల పొత్తు ఖరారైనందున పవన్‌ కళ్యాణ్‌ నేరుగా చంద్రబాబు నాయుడుతోనే భేటీ అవుతూ సీట్ల సర్దుబాట్లను, ఉమ్మడి ఎన్నికల మ్యానిఫెస్టోని ఖరారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

2023 సంవత్సరంలో జనసేన కొత్తగా విజయాలు సాధించలేకపోయినా, ఏపీలో రాజకీయంగా చాలా బలపడింది. అలాగే పవన్‌ కళ్యాణ్‌ టిడిపితో పొత్తులు, వారాహి పర్యటనలతో ఏపీ రాజకీయాలపై తన ముద్ర వేస్తున్నారు కూడా.

గత పదేళ్ళుగా రాజకీయాలలో నలుగుతున్న పవన్‌ కళ్యాణ్‌ ఇంతవరకు శాసనసభలో అడుగుపెట్టలేకపోయారు. కనుక 2024లో టిడిపితో కలిసి జనసేన ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే పవన్‌ కళ్యాణ్‌ రాజకీయంగా మరో మెట్టు ఎక్కిన్నట్లే. మరి 2024 ఆయనకు, జనసేనకు ఏమి సిద్దం చేసి ఉంచిందో తెలియాలంటే మరో 4-5 నెలలు వేచి చూడాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories