రెండు మూడు నెలల క్రితం వరకు ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు చాలా హడావుడి చేశారు. కానీ ఇప్పుడు ఎవరూ కిక్కురుమనడం లేదు. పైగా ఇప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డిని పొగిడేందుకు అందరూ పోటీలు పడుతున్నారు.
“మీరు ఏం చేస్తే అదే మాకు ఓకే! మీరేమిస్తే అదే మహా ప్రసాదం!సంక్షేమ పధకాల అమలు, నిధులు సమకూర్చుకొనే విషయంలో మీ నిబద్దత, దూరదృష్టి నభూతో నభవిష్యత్…” అంటూ పొగుడుతున్నారు.
ఈవిదంగా కొమ్ములు తిరిగిన ఉద్యోగ సంఘాల నేతలను తాను గీసిన గీత దాటకుండా నిలబెట్టగలిగిన సిఎం జగన్మోహన్ రెడ్డికి సర్పంచ్ సంఘాల ఆందోళనలు ఓ లెక్కా? అంటే కాదనే చెప్పొచ్చు.
కానీ వారికి ఈ విషయం తెలియకనో, అర్దంకాకనో… కేంద్ర ఆర్ధిక సంఘం పంచాయతీలకు మంజూరు చేసిన నిధులు విడుదల చేయాలంటూ నేడు విజయవాడలో పంచాయతీ రాజ్ కమీషనర్ కార్యాలయం ముట్టడించారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలలో అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తున్నా వాటిని జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించేస్తోందని, దీంతో గ్రామాలలో రోడ్లు, కాలువలు, వీధి దీపాలు వంటి మౌలికవసతులు కూడా కల్పించలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్ళలో రాష్ట్రంలో 20 మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకొన్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే. పోలీసులు వారిని వ్యానులలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించి కేసులు నమోదు చేశారు. ఇక నుంచి వారందరూ ఆ కేసుల నిమిత్తం పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు కనుక ఇక ఎవరూ వాటి గురించి మాట్లాడలేరు. ఓ సమస్య గురించి అందరూ మాట్లాడటం మానుకొన్నారంటే అర్దం ఏమిటి? ఆ సమస్య పరిష్కారం అయిపోయిన్నట్లే కదా?



