ప్రీ రిలీజుల వేదికలను మార్చుకోమంటే స్టార్లు ఎలా వస్తారు

Chiru Balayya Event
సినిమా వేడుకలు భారీ ఎత్తున బహిరంగంగా జరుపుకోవడం ఇప్పుడు వచ్చిన ట్రెండ్ కాదు. దశాబ్దాల క్రితం స్వర్గీయ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి సీనియర్ లెజెండ్స్ తో మొదలుపెట్టి ఇప్పటి మహేష్ బాబు తారక్ ల దాకా అందరూ ఫాలో అవుతున్నదే. ఒకటి అరా మినహాయించి ఏనాడూ భయపడే సంఘటనలు జరగలేదు. ఎప్పుడో 1986లో సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం శతదినోత్సవం మదరాసు(ఇప్పటి చెన్నై)లో చేస్తే 240 బస్సులు 600 కార్లు వ్యాన్లలో అభిమానులు వచ్చారు. జనాల లెక్క యాభై వేలకు పైగానే ఉంటుందని అప్పటి సాక్షుల కథనం. అయినా చెదురుమదురు లాఠీఛార్జ్ తప్ప ఇంకేమీ జరగలేదు.

చిరంజీవి విజేత, గ్యాంగ్ లీడర్ ఈవెంట్లకు ఇలాంటి సందోహమే వచ్చింది. ప్రభాస్ రాధే శ్యామ్ కు వచ్చిన ఫ్యాన్ సునామిని మర్చిపోగలమా. హీరోలతో ఎంత ఎమోషనల్ కనెక్షన్ ఉన్నా ఎవరూ వీటికొచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోరు. తగిన జాగ్రత్తలతోనే హాజరవుతారు. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం చిరు బాలయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లకు చివరి నిమిషంలో వచ్చి పడ్డ ట్విస్టులు. వీరసింహారెడ్డికి ఒంగోలులో తలపెట్టిన కాలేజీ గ్రౌండ్లో పోలీస్ శాఖ అనుమతి నిరాకరించింది. నగరం బయట మరో చోట చేసుకోమని చల్లగా సెలవిచ్చింది. కానీ మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో ఏకంగా రాష్ట్రమే మారేలా ఉంది

ADVERTISEMENT

ఏర్పాట్లు దాదాపు ఒక కొలిక్కి వచ్చి, పాసులు జారీ చేసి, సిటీ మొత్తం బ్యానర్లు బెలూన్లు కట్టాక ఈ షాక్ తగలడంతో మైత్రి ఆఘమేఘాల మీద ఏం చేయాలనే దాని మీద తర్జనభర్జన పడుతోంది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మరోవైపు వాల్తేరు వీరయ్యకి వైజాగ్ ఆర్కే బీచ్ లో పర్మిషన్ ఇవ్వడం కుదరదని అధికారులు తేల్చేశారు. ఇప్పటికిప్పుడు ఆల్టర్నేటివ్ పట్టుకోవడం కష్టం. అయినా మెగా టీమ్ చివరి నిమిషం దాకా ప్రయత్నం చేస్తోందని టాక్. ఇవన్నీ ఎలా ఉన్నా భద్రత కారణాల పేరుతో ఇలా రద్దు చేయడం ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదు. ఇలాంటి ఫంక్షన్లు మొదటిసారి కాదుగా అనేది వాళ్ళ వెర్షన్

ఇలా సింపుల్ గా నో చెప్పేస్తే భవిషత్తులో ఏపిలో సినిమావేడుకలు చేసేందుకు నిర్మాతలు జంకుతారు. హైదరాబాద్ నడిబొడ్డులో యూసఫ్ గూడలో ఎన్నో ఈవెంట్లు చేస్తే రాని సమస్యలు ఒంగోలు, విశాఖపట్నం లాంటి చోట్ల వస్తాయంటే ఏం చెప్పగలం. వ్యవస్థ ఎక్కడైనా ఒకటేగా. పటిష్ట భద్రత తగినంత పోలీసు రక్షణ కల్పించి నిర్వాహకులకు నియమ నిబంధనలు జారీ చేస్తే అన్నీ సక్రమంగా జరుగుతాయి. లేదూ మా ధోరణి మాదే అంటే ఇకపై అన్ని తెలంగాణలో చూసుకోవాల్సి ఉంటుంది. దీని వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయో లేదో కానీ జనంలో మాత్రం కొత్త చర్చకు తావిచ్చాయి.

ADVERTISEMENT
Latest Stories