భరించిన బాధలు, ఎదుర్కొన్న ఎదురీతలు, చవిచూసిన చేదు అనుభవాలు… ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం పట్ల ఉద్యోగస్తుల మనసులో చెరగని ముద్ర వేసాయన్న విషయాన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెప్పకనే చెప్పాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాల సంగతి దేవుడెరుగు… 1వ తారీఖు నాటికి కనీసం జీతాలు అయినా చేతికి వస్తే చాలు దేవుడా… అనే స్థితికి ఉద్యోగులను తీసుకురావడంలో నేటి అధికార ప్రభుత్వం నూటికి రెండొందల శాతం విజయవంతం అయ్యింది.
ఆ ప్రభావమే నేడు ఉద్యోగస్తులు మునుపెన్నడూ లేని రీతిలో లైన్లలో బారులు తీరి ప్రభుత్వ వ్యతిరేక ఓటును వేసారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే మాటలను ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కూడా బల్లగుద్ది చెప్తున్నారు.
గతంలో 77 శాతంగా నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్, నేడు రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతానికి పైగా నమోదు అయ్యిందంటే, అది ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పాలనకు తార్కాణంగా పేర్కొనవచ్చు.
సాధారణంగా ఓటింగ్ శాతం పెరిగిందంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానే భావిస్తారు. జూన్ 4వ తేదీన వెలికి తీయనున్న పోస్టల్ బ్యాలెట్ నిజంగానే దానిని ప్రతిబింబిస్తే, ఇక జగన్ పాలనకు చరమగీతం పడినట్లేనని తొలిఘడియలలోనే సంకేతాలు వస్తాయి.
నిజానికి తొలి రెండు రౌండ్లలో జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ శాతం గమనించిన పిదప, వైసీపీ నాయకులు తమకు ఓటేయండంటూ ఏకంగా ఉద్యోగస్తులు పాదాల మీద పడిన వైనం సోషల్ మీడియాలలో ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే.
కాళ్ళు పట్టుకున్నా కనికరించే పరిస్థితి లేదని ఉద్యోగస్తుల పోలింగ్ శాతం స్పష్టం చేయడంతో, ఇప్పటికే నిరాశ, నిస్పృహతో ఈ వారంలో మూడు రోజులు ప్రచారానికి సెలవు తీసుకున్న జగన్ మోహన్ రెడ్డికి ఏ మాత్రం మింగుడు పడని అంశంగా మిగిలిపోనుంది.




