రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ళ కేసీఆర్ పాలనలో ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు 35 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్, సబ్ వేలు నిర్మితమయ్యాయి.
అలాగే హైదరాబాద్లో ఓఆర్ఆర్తో పాటు, ఎక్కడికక్కడ పచ్చదనం కూడా పెంచారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాలలో కొత్తగా ఫ్లై ఓవర్లు నిర్మించారు.
ఎక్కడికక్కడ రోడ్ల విస్తరణ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల సుందరీకరణ కూడా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ళలో హైదరాబాద్ నగరంలో మరో అరడజను ఫ్లై ఓవర్లు ప్రారంభోత్సవాలు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించారు.
కానీ ఈ విషయంలో తెలంగాణతో పోలిస్తే ఏపీ చాలా వెనకబడిందనే చెప్పాలి. ఏపీ ప్రభుత్వం దృష్టి అంతా అమరావతిపైనే ఉండటం, ఎన్నికలలోగా అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేయాలనే గడువు పెట్టుకోవడం వలన మిగిలిన జిల్లాలలో ఫ్లై ఓవర్లు, రోడ్ల విస్తరణ పనులపై అశ్రద్ధ చూపుతున్నట్లనిపిస్తోంది.
ఇక విశాఖ, విజయవాడ నగరాలలో మెట్రోతో ఫ్లై ఓవర్లను ముడి పెట్టడం, ఆ ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం వలన రెండు ప్రధాన నగరాలలో కొత్తగా ఫ్లై ఓవర్ల నిర్మాణాలు జరుగలేదు.
తెలంగాణ ప్రభుత్వం ఫ్లై ఓవర్ల నిర్మాణంలో దూసుకుపోతుంటే, ఏపీ ప్రభుత్వం పోర్టులు, విమానాశ్రయాలు, భారీ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటులో దూసుకుపోతోంది.
రాష్ట్ర విభజన తర్వాత 2021లో కర్నూల్, 2024లో కడప, 2026లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటయ్యాయి. విశాఖ శివారులో భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జూలై 8 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతోంది.
ఇది కాక రాజధాని అమరావతిలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం, మరికొన్ని గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకి చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈవిషయంలో తెలంగాణ వెనుకబడి ఉంది. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళు. కానీ ఇప్పటి వరకు కొత్తగా ఒక్క విమానాశ్రయం ఏర్పాటు చేసుకోలేకపోయారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ వాటి నిర్మాణం ఇంకా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు.
ఏపీలో నగరాలను, పట్టణాలను కలుపుతూ చక్కటి హైవే రోడ్లు నిర్మించారు. కానీ నేటికీ ఏపీలో చాలా నగరాలలో, పట్టణాలలో కొత్తగా ఫ్లై ఓవర్లు నిర్మించనే లేదు. అలాగే పచ్చదనం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కనుక తెలంగాణకు విమానాశ్రయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫ్లై ఓవర్లు ఆవశ్యకత ఎంతైనా ఉంది.




