కందుకూరు, గుంటూరులో టిడిపి అధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలలో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడంతో ఏపీ ప్రభుత్వం తాజాగా ఓ జీవో జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో రోడ్లపై రోడ్ షోలు, ర్యాలీలు, సభలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శిహరీష్ కుమార్ గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాజకీయ పార్టీలు రోడ్లపై నిర్వహిస్తున్న ఈ రోడ్ షోలు, ర్యాలీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా తొక్కిసలాటలు జరిగి మృతి చెందుతున్నందున ఈ నిషేదం విధించిన్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం జిల్లా ఎస్పీ, పోలీస్ కమీషనర్ అనుమతితో నిర్దేశించిన ప్రాంతాలలో సభలు, రోడ్ షోలు నిర్వహించుకోవచ్చునని జీవోలో పేర్కొన్నారు. రోడ్ షోలు లేదా ర్యాలీలు ఏ మార్గంలో, ఏ సమయంలో నిర్వహిస్తారో, వాటిలో ఎంతమంది పాల్గొంటారో వగైరా వివరాలతో లిఖిత పూర్వకంగా పోలీసులకు తెలియజేసి, అనుమతిస్తేనే నిర్వహించుకోవచ్చునని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఈ ఒక్క జీవోతో టిడిపి, జనసేనలు ఇక రాష్ట్రంలో రోడ్ షోలు, సభలు నిర్వహించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నెల నుంచి నారా లోకేష్ ప్రజాగళం పాదయాత్ర చేయలేరు. జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో బస్సు (వారాహి) యాత్రలు చేయలేరు. చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలు చేయలేరు. ఒకవేళ ప్రతిపక్షాలు రోడ్ షోలు, సభలు నిర్వహించుకోలేకపోతే వాటికి ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు తెగిపోతాయి. పార్టీ కార్యాలయాలలో కూర్చొని ఎన్ని మీడియా సమావేశాలు నిర్వహించినా అవన్నీ ఒక బహిరంగసభ లేదా రోడ్ షోపాటి చేయవు. ఈ జీవో ప్రతిపక్షాల మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చేసే ప్రమాదం ఉంది కనుక బహుశః రెండు పార్టీలు హైకోర్టుని ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది.



