ఆనాడు జగన్ అక్రమాస్తుల కేసులలో సంతకాలు పెట్టిన పలువురు ఐఏఎస్ అధికారులు జైలు పాలైన సంగతి తెలిసిందే. ఆనాడు మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి సైతం ఆ కేసుల్లో చిక్కుకొన్నారు.
అదేవిదంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో తీసుకొన్న నిర్ణయాలను వైసీపి ప్రభుత్వం ఏవిదంగా తిరగదొడి కేసులు, అరెస్టులు చేయిస్తోందో, అదేవిదంగా ఇప్పుడు వైసీపి ప్రభుత్వ హయాంలో తీసుకొంటున్న నిర్ణయాలను తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వం తిరగదోడటం ఖాయం.
ఇప్పుడు జగన్ నిర్ణయాలకు తలలూపుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా కోర్టుల చుట్టూ తిరగక తప్పదని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తుండటం అందరూ విన్నారు.
ఆ జాబితాలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చేరే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ఇప్పించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకొన్నారు. దానిని ఆమోదించి అమలుచేయాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రిదే.
అసలు టోఫెల్ ఏమిటి? అంటే విదేశీ యూనివర్శిటీలలో చదువుకోవాలనుకొంటున్న విద్యార్ధులకు తగిన ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం ఉందా లేదా?అని పరీక్షించేందుకు టోఫెల్ నిర్వహిస్తుంటారు. అంటే ఇంజనీరింగ్ లేదా డిగ్రీ పూర్తి చేసే ముందో తర్వాతో టోఫెల్ శిక్షణ తీసుకోవలసి ఉంటుందన్న మాట!
కానీ వైసీపి ప్రభుత్వం 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ఇప్పిస్తానంటోంది. ఇదే అనుమానాలకు తావిస్తోంది. టోఫెల్ శిక్షణ పేరుతో జగన్ ప్రభుత్వం భారీ కుంభకోణంకి శ్రీకారం చుట్టి ఉండవచ్చని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అనుమానం వ్యక్తం చేస్తూ దీనిపై విద్యాశాఖా మంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి బొత్స చెప్పిన లెక్కల ప్రకారం చూసుకొన్నా ఈ శిక్షణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.156 కోట్లు ఖర్చు చేయబోతోంది.
ఉదాహరణకు 10వ తరగతి విద్యార్ది టోఫెల్ శిక్షణ పూర్తి చేసుకొన్నా వెంటనే అమెరికాలో విదేశీ యూనివర్సిటీలో చేరలేడు. ఒకవేళ డిగ్రీ పూర్తిచేసిన తర్వాత చేరాలనుకొన్నా అందుకు మరో 6 ఏళ్ళు పడుతుంది. దాని కోసం మూడో తరగతి నుంచే శిక్షణ ఎందుకు?అంటే టోఫెల్ శిక్షణ పేరుతో కుంభకోణమే అని జనసేన వాదిస్తోంది.
ఇది కుంభకోణమే అయితే జగన్ తీసుకొన్న ఈ నిర్ణయానికి విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా బాధ్యులే అవుతారు. కనుక భవిష్యత్లో ఎప్పుడైనా ఈ కుంభకోణంపై విచారణ జరిపిన్నట్లయితే, ‘సహేంద్ర తక్షకాయిస్వాహా…’ అన్నట్లు జగన్తో పాటు బొత్స సత్యనారాయణ కూడా కోర్టుల చుట్టూ తిరుగకతప్పదన్న మాట! మరి బొత్స వారేమంటారో?




