కూటమిలో కుమ్ములాటలు….వైసీపీ లో ఆశలు రేపుతున్నదెవరు.?

AP Local Body Elections: TDP-Jana Sena Rift Raises Questions

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల సమర శంఖం మోగబోతుంది, 2024 ఎన్నికల నాటి ఫలితాలకు యుద్దానికి సిద్ధం కావాలి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు కూటమి పార్టీల నేతలకు సూచించగా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏకగ్రీవాలకు ఎట్టి పరిస్థితులలో ఆస్కారం ఉండకూడదు అంటూ తన పార్టీ క్యాడర్ కి ఆదేశాలిచ్చారు.

అయితే బాబు చేసిన ఈ ప్రకటన టీడీపీ క్యాడర్ లో ఆశలు రేకెత్తిస్తే, వైసీపీ క్యాడర్ లో ఆందోళనలు, జనసేన పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. స్థానిక ఎన్నికల పోటీలో తగ్గేదెలా అంటూ ఇది మా ఆత్మగౌరవం అంటూ జనసేన పొత్తుకు విరుద్ధంగా బహిరంగ ప్రకటనలు చేస్తుంది.

ADVERTISEMENT

దానితో ఇటు తెలుగు తమ్ముళ్లు సైతం ప్రత్యర్థి వైసీపీ తో చెయ్యాల్సిన రాజకీయ యుద్దాన్ని కాస్త జనసేన మీద సాగిస్తున్నారు. ఇలా ఇరు పార్టీల శ్రేణులు నువ్వా – నేనా అంటూ సోషల్ మీడియా వేదికగా ఒకరి పై ఒకరు రెచ్చిపోతున్నారు, అలాగే ఒకరినొకరు రెచ్చకొట్టుకుంటున్నారు.

అయితే కూటమిలో ఇటువంటి ఆధిపత్య కుమ్ములాటల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న వైసీపీ వీరి అంతర్గత యుద్ధాలతో అధికారం పై ఆశలు పెంచుకుంటూ పోతుంది. మొన్నటి వరకు స్థానిక సమరంలో గెలుపోటములు కాదు, వైసీపీ అభ్యర్థులు పోటీకి దిగితే చాలు అంటూ స్వయానా పార్టీ అధినేత జగన్ ప్రకటనలు చేసారు.

కానీ ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు స్థానిక ఎన్నికలలో వైసీపీ దే అధికారం, గెలిచేది మేమే, ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత కట్టలు తెంచుకుంటుంది, అందుకు స్థానిక ఎన్నికల ఫలితాలే సజీవ సాక్షాలు అంటూ పార్టీ గెలుపు పై చాల ధీమాగా ప్రకటనలు చేస్తున్నారు.

అసలు వైసీపీ నేతలకు తమ పార్టీ గెలుపు పై అంతగా ఆశలు రేపుతున్నదెవరు.? అన్నది ఒక్కసారి టీడీపీ, జనసేన శ్రేణులు ఆత్మపరీక్ష చేసుకుంటే యిట్టె అర్ధమవుతుంది. ఒకపక్క కూటమి అధినేతలు 15 ఏళ్ళ పాటు కూటమి పొత్తు కొనసాగాలి అంటూ పదేపదే పార్టీ శ్రేణులను హెచ్చరిస్తున్నా,

ఏమైనా సమస్యలుంటే అంతర్గతంగా మాట్లాడి పరిష్కరించుకుందాం కానీ పొత్తుకు విఘాతం కలిగేలా ఇరు పార్టీ నేతలు ఎటువంటి బహిరంగ ప్రకటనలు చేయొద్దంటూ బుజ్జగిస్తున్నా ఇంకా కూటమి లో ఈ అనిచ్చితి, అసంతృప్తి ఎందుకు.? కూటమిగా ఉంటూ తమ పార్టీల బలం పెంచుకోవాల్సిన ఈ సోకాల్డ్ నేతలు అధిష్టాన నిర్ణయాలకంటే ముందుగానే సీట్ల పంపకాల మీద పంచాయితీలకు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

కూటమి బలహీనతే వైసీపీ బలం అనే వాస్తవ సత్యాన్ని టీడీపీ, జనసేన శ్రేణులు గమనించలేకపోతున్నారా.? పిల్లి, ఎలక గొడవ మరెవరికో ఆహారం గా మారింది అన్నట్టుగా టీడీపీ, జనసేనల అంతర్గత ఆధిపత్య పోరాటాలు వైసీపీ కి అధికారాన్ని అందించే ఆయుధంగా మారబోతుందా.? అనేది వారియర్స్ అండ్ సైనిక్స్ ఆత్మపరిశీలన చేసుకోవాలి..!

ADVERTISEMENT
Latest Stories