విశాఖలో ఐఏటీవో సదస్సు.. పర్యాటకంలో పురోగతికి నిదర్శనమేగా?

AP Tourism development discussed at IATO conference in Visakhapatnam

దేశంలో, రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురైన రంగాలలో పర్యాటక రంగం కూడా ఒకటి. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో పెద్దగా కేటాయింపులు జరుపవు. అరకొరగా పర్యాటక కేంద్రాల నిర్వహణ చేపడుతూ అలసత్వం ప్రదర్శిస్తూ ఉంటాయి. అయితే గత కొన్నేళ్ళుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక రంగం ప్రాధాన్యతని గుర్తించి దానిపై కాస్త శ్రద్ధ పెడుతుండటం చాలా సంతోషకరం.

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక ఆకర్షణ కేంద్రాలకు కొదవ లేదు. అటు చిత్తూరు నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు పర్యాటక ఆకర్షణ కేంద్రాలు కోకొల్లలున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, ప్రోత్సహిస్తుండటంతో మళ్ళీ వేగం పుంజుకుంది.

ADVERTISEMENT

గురువారం నుంచి విశాఖలో ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్’ (ఐఏటీవో) 41వ వార్షిక సదస్సు మొదలైంది.

ఈ సదస్సులో ముఖ్య అతిధిగా పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఐఏటీవో అధ్యక్షుడు రవి గోసైన్ ఈ సదస్సులో ఏపీ ప్రభుత్వానికి అమూల్యమైన సూచనలు చేశారు. విదేశీ పర్యాటకులు, స్వదేశీ పర్యాటకుల అభిరుచులకు తగ్గట్లుగా విధానాలు రూపొందించుకోవాలని సూచించారు.

· ముఖ్యంగా విదేశీ పర్యాటకులు శుభ్రతకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. కనుక పర్యాటక ఆకర్షణ కేంద్రాలను విధిగా పరిశుభ్రంగా ఉంచడం అవసరమని రవి గోసైన్ సూచించారు.

· విదేశీ పర్యాటకులలో అత్యధిక శాతం యూపీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలలో చారిత్రిక కట్టడాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతుంటారు.

· భారతీయ సంస్కృతిని ప్రతిభింబించే ఆలయాలను, ప్రకృతి అందాలను చూసేందుకు ఇష్టపడతారు. మన పండుగలు, ఆచారాల గురించి తెలుసుకుని వాటిలో పాల్గొని ఆస్వాదించాలనుకుంటారు.

· విదేశీ పర్యాటకులు భారత్‌లో పర్యటించినప్పుడు తప్పనిసరిగా గోవా బీచ్‌ వంటి పర్యాటక కేంద్రాలను సందర్శిస్తుంటారు.

· విదేశాలలో వైద్య చికిత్సలతో పోలిస్తే భారత్‌లో చాలా తక్కువ ఖర్చుతో వైద్యం పొందవచ్చు కనుక భారత్‌లో హెల్త్ టూరిజం కూడా బాగుంది.

కనుక ఈ అంశాలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా విధానాలు రూపొందించుకొని, పర్యాటక ఆకర్షణ కేంద్రాలలో మరింత మెరుగైన సౌకర్యాలు, వసతి, రవాణా సదుపాయాలూ కల్పించాలని రవి గోసైన్ సూచించారు.

ఈ సూచనలపై మంత్రి కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం పాలసీ నుంచి ప్రమోషన్ వరకు పర్యాటక రంగంలో ఆరు అంచెల విధానం అమలుచేస్తున్న తీరు గురించి వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్ల గురించి వివరించి, ఐఏటీవోలో సభ్య సంస్థలు కూడా తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖలో ఈ సదస్సు జరుగుతుండటమే ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగం పురోగతికి చక్కటి నిదర్శనం. కేంద్ర రాష్ట్ర మంత్రులు ఈ సదస్సులో ఏదో మొక్కుబడిగా పాల్గొనకుండా పర్యాటక రంగంపై పూర్తి ఆసక్తి, అవగాహనతో మాట్లాడటం, ఐఏటీవో సభ్యుల సూచనలకు సానుకూలంగా స్పందించడం ఓ మంచి మార్పుకి నిదర్శనమే కదా?

ADVERTISEMENT
Latest Stories