టిడిపి అధికారంలోకి వస్తే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని టిడిపి మినీ మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లా పోలిపల్లిలో ‘యువగళం-నవశకం’ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మరోమారు ఆ హామీని అమలుచేస్తామని ప్రకటించారు.
తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే హామీ (మహాలక్ష్మి పధకం) ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు టిడిపి కూడా అదే హామీ ఇస్తుండటంతో వైసీపి ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే ఇప్పటికే టిడిపి ఈ హామీని ప్రకటించేసింది కనుక వైసీపి ఎన్నికల మ్యానిఫెస్టోలో దానిని చేర్చినా పెద్దగా ప్రయోజనం ఉండదు.
కనుక వీలైతే వచ్చే నెల సంక్రాంతి పండుగ నుంచే జగనన్న పేరు తగిలించి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం రాష్ట్ర రవాణాశాఖ, ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో కూడిన ఓ బృందం ఇరుగు పొరుగు రాష్ట్రాలలో అమలవుతున్న ఈ పధకం తీరుతెన్నులు, లాభనష్టాలు, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారి నివేదిక, సిఫార్సులని బట్టి వీలైతే ఈ సంక్రాంతి పండుగ నుంచే ఈ పధకాన్ని ప్రారంభించవచ్చని తెలుస్తోంది.
వైసీపి ప్రభుత్వానికి ఈ ఆలోచన చేస్తున్నందునే మంత్రులు, వైసీపి ఎమ్మెల్యేలు ఎవరూ టిడిపి ప్రకటించిన ఈ ఉచిత బస్సు ప్రయాణం హామీని విమర్శించడం లేదు. ఇది ఆచరణ సాధ్యంకాని హామీ అని వైసీపి నేతలు ఎవరూ ఖండించడం లేదు. కనుక వైసీపి ప్రభుత్వం కూడా ఈ పధకం అమలుచేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
దీనికి మరో బలమైన కారణం కూడా కన్పిస్తోంది. టిడిపి కంటే ముందుగానే రాష్ట్రంలో ఈ పధకాన్ని అమలుచేసిన్నట్లయితే, ఎన్నికలలో దీని గురించి చెప్పుకోవడానికి టిడిపికి అవకాశం ఉండదు. ఒకవేళ చెప్పుకొన్నా ప్రజలు పట్టించుకోరని వైసీపి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ టిడిపి ప్రకటించిన ఈ హామీని వైసీపి హైజాక్ చేయాలనుకొంటే, మిగిలిన హామీలను కూడా ఇదేవిదంగా హైజాక్ చేసి ముందుగానే అమలుచేస్తే మంచిది కదా?




