లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్ని గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆయనని అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా, తమిళనాడు సిఎం స్టాలిన్, కేరళ సిఎం పినరయి విజయన్, వామపక్ష నేతలు, బిఆర్ఎస్ పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు తీవ్రంగా ఖండించారు.
అర్వింద్ కేజ్రీవాల్ని, ఆమాద్మీ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్రధాని నరేంద్రమోడీ లోక్సభ ఎన్నికలకు ముందు రాజకీయ దురుదేశ్యంతో అర్వింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారని వారు ఆరోపించారు.
అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే కేటీఆర్తో సహా దేశవ్యాప్తంగా వివిద పార్టీలకు చెందిన ఇంతమంది ప్రముఖులు వెంటనే స్పందించి ఖండిస్తున్నారు. కానీ ఇదే కేసులో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితని ఈడీ అరెస్ట్ చేసినప్పుడు ఏ ఒక్కరూ స్పందించలేదు!
ఇదివరకు కేసీఆర్ ‘థర్డ్ ఫ్రంట్’ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రత్యేక విమానం వేసుకొని వారందరి వద్దకు వెళ్ళి మాట్లాడారు. కనుక వారందరితో కేసీఆర్కు మంచి పరిచయాలు ఉన్నాయి కూడా. కానీ వారిలో ఏ ఒక్కరూ ఆయన కూతురు అరెస్ట్ అయితే ఖండించలేదు!
ఎందుకంటే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి ప్రధాని కావాలని ఆరాటపడిన కేసీఆర్ వారందరూ తన నాయకత్వాన్ని అంగీకరించాలని కోరుకున్నారు. వారు అందుకు అంగీకరించకపోవడంతో కేసీఆర్ వారిని వదిలేసి ఒంటరిగా ప్రయాణించాలనుకున్నారు. కానీ శాసనసభ ఎన్నికలలో ఓడిపోవడంతో కేసీఆర్ తెలంగాణ గడప దాటలేని దుస్థితి ఏర్పడింది. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ అందరినీ దూరం చేసుకోవడం పెద్ద తప్పు. అందుకే ఆయన దేశ రాజకీయాలలో ఏకాకిగా మిగిలిపోయారు.
మరో విషయం ఏమిటంటే, మోడీ రాజకీయ కక్షకు అర్వింద్ కేజ్రీవాల్ బలైపోయారని వాదిస్తున్నవారు, కల్వకుంట్ల కవిత కూడా అలానే బలైపోయారని అనడం లేదు. ఈ కేసులో ఆయన నిర్ధోషని వివిద పార్టీల నాయకులు భావిస్తున్నట్లయితే, కల్వకుంట్ల కవిత కూడా నిర్దోషే కదా?
కానీ అందరూ అర్వింద్ కేజ్రీవాల్కు మాత్రమే సంఘీభావం ప్రకటిస్తున్నారు తప్ప ఎవరూ కల్వకుంట్ల కవితకు, కేసీఆర్కు అండగా నిలబడేందుకు ముందుకు రావడం లేదు ఎందువల్ల?అంటే కేసీఆర్ వారందరినీ దూరం చేసుకున్నారు కనుక. ఇది కేసీఆర్ స్వయంకృతమే కనుక ఆయన కూడా వారిని నిందించలేరు.




