వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా నియమితులయ్యే వరకు దశాబ్దాలపాటు బీజేపీలో చాలా చురుకుగా పనిచేసేవారు. ఆయన అనేక పదవులు చేపట్టినా బీజేపీ నాయకుడుగా గుర్తింపునే కోరుకునేవారు. ఆ పార్టీతో అంతగా అనుబందం పెనవేసుకున్న అయనకు ఉప రాష్ట్రపతి పదవి లభిస్తే అందుకు సంతోషం కంటే బీజేపిని వీడాల్సివస్తున్నందుకు ఎక్కువ బాధ పడ్డారు. కానీ అటువంటి రాజ్యాంగపదవి చేపట్టినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉండాలి కనుక చాల బాధపడుతూనే బిజేపీకి రాజీనామా చేశారు.
ఇప్పుడు గోవా గవర్నర్ పదవి చేపట్టబోతున్న అశోక్ గజపతిరాజు పరిస్థితి కూడా సరిగ్గా అదే. ఎన్టీఆర్ 1982లో టీడీపిని స్థాపించినప్పుడు ఆయన ఆహ్వానం మేరకు అశోక్ గజపతిరాజు టీడీపిలో చేరి అప్పటి నుంచి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీలోనే ఉన్నారు.
కనుక టీడీపితో నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని రాజీనామాతో తెంచుకోక తప్పలేదు. నిన్న టీడీపి పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి అయన రాజీనామా చేస్తున్నప్పుడు అయనతో పాటు టీడీపి నేతలు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
అశోక్ గజపతి రాజుని నాడు ఎన్టీఆర్, తర్వాత చంద్రబాబు నాయుడుతో సహా పార్టీలో అందరూ ఎంతో గౌరవించారు. అయన కూడా టీడీపి పట్ల అంతే విధేయంగా ఉండేవారు. పదవి, అధికారం ఉన్నా లేకపోయినా రాజకీయాలలో హుందాగా వ్యవహరిస్తూ అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా విజయనగరం జిల్లా ప్రజల దృష్టిలో అశోక్ గజపతి రాజు నేటికీ రాజుగారే.
ఈవిధంగా అందరిచేత ఎంతగానో గౌరవింపబడుతూ, ఎంతో హుందాగా వ్యవహరించే అయనతో కూడా జగన్ చాలా అనుచితంగా వ్యవహరించారు. చాలా చాలా అవమానించారు. అయినా అశోక్ గజపతి రాజు ఏనాడూ జగన్ని ఉద్దేశ్యించి తప్పుగా ఒక్కమాట మాట్లాడలేదు. రాజకీయాలలో ఈ హుందాతనం వల్లనే నేడు ఆయనకు గోవా గవర్నర్ పదవి లభించింది.
విజయనగరం ప్రజలు, టీడీపి నేతలు ఆయన గవర్నర్ పదవి చేపట్టబోతున్నందుకు చాలా సంతోషిస్తూనే, తమకు దూరం అవుతున్నందుకు చాలా బాధపడుతున్నారు కూడా. అటు ప్రజలలో, ఇటు పార్టీ నేతలలో కూడా మంచి పేరు సంపాదించుకొని ఇటువంటి వీడ్కోలు పొందడం కూడా ఓ అపూర్వమైన గౌరవమే కదా?




