టెస్ట్ మ్యాచ్ దశ తిరుగుతోంది. మంగళవారం నాడు నమోదైన సంచలన సంగతి ముగియక ముందే, టెస్ట్ క్రికెట్ లో మరో సంచలనం నమోదైంది. మంగళవారం నాడు ఇంగ్లాండ్ ను విండీస్ చావుదెబ్బ కొట్టగా, బుధవారం నాడు టాప్ టీం ఆస్ట్రేలియాను బంగ్లాదేశ్ జట్టు ఓడించి సత్తా చాటింది. దీంతో ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ కున్న పవర్ ఏమిటో అందరికీ తెలిసి వస్తోంది. నాలుగవ ఇన్నింగ్స్ లో 265 పరుగులతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు మూడవ రోజు ఆట ముగిసే సమయానికి 109 పరుగులు చేసి 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది.
దీంతో ఆస్ట్రేలియా జట్టుకు ఈ లక్ష్యం ‘కేక్ వాక్’ అనుకుని భావించిన వారికి బంగ్లా ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ 5 వికెట్లు పడగొట్టి కంగారులకు భారీ షాక్ ఇచ్చాడు. నిజానికి ఒకానొక దశలో ఆసీస్ ఈ లక్ష్యాన్ని అవలీలగా అందుకుంటుందని భావించగా, సెంచరీ సాధించిన తర్వాత డేవిడ్ వార్నర్ (112) పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ దశలో 158 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోగా, 199 పరుగులు చేసే సమయానికి ఏకంగా 8 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుని పోయింది.
చివర్లో కమ్మిన్స్ కాసేపు బ్యాట్ ఝుళుపించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 244 పరుగులకు ఆసీస్ ఆలౌట్ కావడంతో, 20 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయభేరి మ్రోగించింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజు నుండి బంగ్లాదేశ్ ఆధిపత్యం ప్రదర్శిస్తూనే ఉండగా, ఆసీస్ డిఫెన్స్ లోనే ఉంటోంది. బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో 260 పరుగులు చేయగా, ఆసీస్ కేవలం 217 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. బంగ్లా మరు ఇన్నింగ్స్ లో 221 పరుగులకు ఆలౌట్ కావడంతో, కంగారుల లక్ష్యం 265 పరుగులుగా నిర్దేశింపబడింది. ఆల్ రౌండ్ ప్రతిభతో షకిబ్ అల్ హసన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.


