కొన్నేళ్ళ క్రితం ఓ ఉగ్రవాదికి తెల్లవారుజామున జైల్లో మరణశిక్ష అమలుచేస్తున్నప్పుడు, అతని తరపు న్యాయపోరాటం చేస్తున్న న్యాయవాదులు అర్దరాత్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తలుపుతట్టారు. అతను ఉగ్రవాదే అయినప్పటికీ అది ఓ మనిషి ప్రాణానికి సంబందించిన అత్యంత ముఖ్యమైన, అత్యవసరంగా నిర్ణయం తీసుకోవలసిన విషయం కనుక సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అర్దరాత్రి వారి వాదనలు విని తీర్పు చెప్పారు.
అయితే నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనలో నిందితులుగా పేర్కొనబడిన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వర రావు, ఆయన సోదరుడు, నెల్లూరు లోక్సభ నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జ్ ఇంటూరు రాజేష్ల విషయంలో కూడా అదేవిదంగా నిన్న అర్దరాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము 5గంటలకు వరకు హైడ్రామా సాగటం విశేషం.
పోలీసులు గురువారం హైదరాబాద్కి వెళ్ళి అక్కడ వారి నివాసం నుంచి ఇద్దరినీ అదుపులో తీసుకొని అర్దరాత్రి 1.45 గంటలకి తీసుకురావడంతో కందుకూరులో హైడ్రామా మొదలైంది. నిజానికి వారిపై పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత నోటీస్ పంపించి పోలీస్ స్టేషన్కు హాజరుకావాలని ఆదేశించవచ్చు. ఒకవేళ వారు నిరాకరిస్తే అప్పుడు వారిని అదుపులో తీసుకొని తీసుకురావచ్చు. కానీ నేరుగా అదుపులో తీసుకొని అర్దరాత్రి రహస్యంగా పోలీస్ స్టేషన్కి తీసుకురావడంతో వారిని కాపాడుకొనేందుకు టిడిపి న్యాయవాదులు రంగంలో దిగాల్సి వచ్చింది.
స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలేటి శ్రీధర్ నాయుడు, పలువురు సీనియర్ న్యాయవాదులు, పలువురు హైకోర్టు న్యాయవాదులు, స్థానిక టిడిపి నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు ఈరోజు తెల్లవారుజామున 2.30 గంటలకి కందుకూరు పోలీస్ స్టేషన్ వద్దకి చేరుకొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకి వారికీ చాలాసేపు వాగ్వాదాలు జరిగాయి. చివరికి కొంతమంది న్యాయవాదులని పోలీస్ స్టేషన్లోకి అనుమతించారు.
వారి సమక్షంలో పోలీస్ స్టేషన్లో లాంచనాలు పూర్తి చేసిన తర్వాత ఇంటూరి సోదరులివురినీ పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహింపజేశారు. అక్కడి నుంచి జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి పూర్ణిమాదేవి ఇంటికి తీసుకువెళ్లారు. అప్పటికి సమయం తెల్లవారుజాము 3.25 గంటలు!
ఆ సమయంలో ఆమె ఎదుట ప్రభుత్వ తరపు న్యాయవాదులు, టిడిపి న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సుమారు గంటన్నర సేపు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆమె ఇంటూరి సోదరులకి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు చెప్పారు.
కందుకూరు ఘటన చాలా బాధాకరమే. అందుకు టిడిపి నేతలు కూడా చాలా బాధపడ్డారు. అందుకే బాధిత కుటుంబాలకి పార్టీ తరపున భారీగా ఆర్ధికసాయం అందజేసి, వారి పిల్లల చదువుల బాధ్యత తీసుకొంటామని హామీ ఇచ్చారు కూడా.
కానీ ఇంటూరి సోదరులు ఏదో కరడుగట్టిన ఉగ్రవాదులన్నట్లు పోలీసులు హైదరాబాద్కి వెళ్ళి వారిని అరెస్ట్ చేసి అర్దరాత్రి పోలీస్ స్టేషన్కి తీసుకురావడాన్నే న్యాయవాదులు, టిడిపి నేతలు తప్పు పడుతున్నారు. శాసనసభ, లోక్సభకి పోటీ చేయాలనుకొంటున్నవారిరువురూ నిత్యం ప్రజల మద్యే ఉంటారు. కనుక పోలీసులు నోటీస్ పంపించి ఉంటే వారే పోలీస్ స్టేషన్కి వచ్చి ఉండేవారు కదా?న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేశారు కదా?మరి పోలీసులు అర్దరాత్రి పూట ఇంత హడావుడి చేసినా చివరికి ఏం సాధించారు?అసలు టిడిపి నేతలనీ అరెస్ట్ చేయడానికి పోలీసులకి ఎందుకు ఇంత అత్యుత్సాహం?



