నందమూరి నటసింహం బాలకృష్ణతో ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన యువ ప్రొడ్యూసర్ పరుచూరి కిరీటిపై హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిలింనగర్ కు చెందిన సినీ నిర్మాత పరుచూరి కిరీటి ఫార్చ్యూనర్ కారులో నిబంధనలకు విరుద్ధంగా వేగంగా వెళ్తూ హల్చల్ చేశారు. ఇలా గత నాలుగు రోజులుగా ఆ రోడ్డులో ఒకే సమయంలో కారు అతి వేగంగా వెళ్తుండడంతో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45లో ఉన్న ఓ హోం గార్డు గమనించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు, ఆ కారు ఎవరిదని ఆరా తీసి మాటు వేశారు. తాజాగా శివరాత్రి రోజున శుక్రవారం నాడు కూడా అదే రోడ్ లో మాదాపూర్ వైపు నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంగా దూసుకు రావడంతో అడ్డుకున్న పోలీసులు పరుచూరి కిరీటీపై ర్యాష్ డ్రైవింగ్ కేసు పెట్టారు. ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఏదొక రూపంలో నిత్యం వార్తల్లో సందడి చేస్తున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుత యువతరం కాస్త ఎక్కువ దూకుడును ప్రదర్శిస్తున్నారని తాజా పరిణామం మరొకసారి స్పష్టం చేసింది.


