ఒంగోలు వైసీపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి బంధువులే అయినప్పటికీ వారిద్దరి మద్య పొసగదని 2-3 నెలల క్రితమే జిల్లా ఎస్పీ నియామకం సందర్భంగా బయటపడింది. వైవీ సుబ్బారెడ్డి తనకు ఎసరు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని బాలినేని ఆరోపించారు.
ఎస్పీ విషయంలో తన మాటని గౌరవించనందుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీపై అలిగి రాజీనామాకు సిద్దపడ్డారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా కలుగజేసుకొని బాలినేనితో మాట్లాడి బుజ్జగించి ఆయన కోరుకొన్న అధికారినే జిల్లా ఎస్పీగా నియమించారు.
తాగాజా బాలినేని శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ అలిగారు. ఈసారి తాను ఎరికోరి తెచ్చుకొన్న జిల్లా ఎస్పీ మీదే ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన ఇద్దరు గన్మెన్లని ఎస్పీకి సరెండర్ చేసేశారు. జిల్లాలో బయటపడిన నకిలీ భూదస్తావేజుల వ్యవహారంలో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుంభకోణం వెనుక ‘ఎంత పెద్దవారున్నప్పటికీ’, ‘వారు వైసీపికి చెందినవారే అయినప్పటికీ’ ఉపేక్షించవద్దని కోరుతున్నారు. కానీ జిల్లా పోలీసులు ఈ కేసులో ఓ పది మందిని అరెస్ట్ చేసి ‘మమ’ అనిపించేసి ‘ఎవరినో కాపాడేందుకు’ ప్రయత్నిస్తున్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
బాలినేని అంటున్న ‘ఆ ఎవరో’ మరెవరో కాదు ఎంపీ వైవీ సుబ్బారెడ్డే అని వేరే చెప్పక్కరలేదు. ఆయన అనుచరులే నకిలీ దస్తావేజులు తయారుచేసి భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. కనుక తన వెనక గోతులు తవ్వాలని చూస్తున్న వైవీ సుబ్బారెడ్డికి చెక్ పెట్టేందుకే ఈ వ్యవహారంపై విచారణకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి పట్టుబడుతున్నారని వైసీపిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే వైవీ సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అటువంటి వ్యక్తిని బాలినేని కోసం వదులుకొంటారనుకోలేము. కనుక బాలినేని వెనక్కు తగ్గకపోతే ఆయననే బయటకు పంపించవచ్చు. అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తుపాకీని తనపైనే గురిపెట్టుకొని వైవీ సుబ్బారెడ్డిని టార్గెట్ చేస్తున్నానని భ్రమలో ఉన్నట్లున్నారు.




