బాలకృష్ణ ‘బసవతారకం’ హాస్పిటల్ పై సంచలన ఆరోపణలు!

Basavatarakam Indo American Cancer Hospital & Research Institute చాలామంది రోగులకు తన హాస్పిటల్ ద్వారా వైద్యం అందించిన నందమూరి బాలకృష్ణ ‘బసవతారకం ఇండో- అమెరికన్ కేన్సర్’ హాస్పిటల్ పై తాజాగా సంచలన ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలు చేస్తోంది కూడా మరెవరో కాదు, సదరు హాస్పిటల్ లో ‘ఆర్ అండ్ డి’ విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రసాద్ కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. అంతేకాదు, తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని సదరు డాక్టర్ ప్రస్తావించడంతో విషయం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది.

ఓ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన డాక్టర్ ప్రసాద్… యాజమాన్యంలోని కొందరు తమపై కక్ష కట్టారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతోందని, కొన్ని విషయాలు సరైన పద్ధతిలో జరగడం లేదని ఆరోపించారు. ఇక్కడ జరుగుతున్న రీసెర్చిలలో చాలా వరకు కరెక్టు కాదని, ‘ఫేక్ రీసెర్చ్ లు’ జరుగుతున్నాయని, రీసెర్చి చేయకుండానే డేటా చూపిస్తున్నారని సంచలన ఆరోపించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లానని, అలాగే ఆసుపత్రి బోర్డుకు లేఖలు రాసినా ఫలితం లేకుండాపోయిందని అన్నారు.

ADVERTISEMENT

తాము తాగే టీ, కాఫీల్లో గుర్తించలేని పదార్థాలు కలుపుతున్నట్లు గుర్తించామని, ఈ మేరకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని అన్నారు. ప్రతి ఏడాది ఉద్యోగులు కనబరచిన ప్రతిభ గురించి ఆరా తీస్తారని, అయితే, తమ విభాగం గురించి మాత్రం పట్టించుకోవడం లేదని, తాను అడుగుతున్నప్పటికీ యాజమాన్యం స్పందించడం లేదని, ఒక రకమైన భయాందోళనలకు తమను గురిచేస్తున్నారని, తమను వేధించడం, ఒంటరి వాళ్లను చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి పాలకవర్గం డైరెక్టర్ ఎంవిఎస్ఎస్ మూర్తి కొట్టిపారేశారు.

ADVERTISEMENT
Latest Stories